Indian Railways: వర్షాలకు రద్దైన రైలు.. విద్యార్థిని గమ్య స్థానానికి చేర్చడానికి రైల్వే శాఖ చేసిన పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే..

దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో రహదారులు జలమయమైపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా భారతీయ రైల్వేశాఖ పలు రైళ్లను పూర్తిగా , మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది

Indian Railways: వర్షాలకు రద్దైన రైలు.. విద్యార్థిని గమ్య స్థానానికి చేర్చడానికి రైల్వే శాఖ చేసిన పనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే..
Indian Railways
Follow us

|

Updated on: Jul 14, 2022 | 4:55 PM

దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో రహదారులు జలమయమైపోతున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా భారతీయ రైల్వేశాఖ పలు రైళ్లను పూర్తిగా , మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రైళ్లను రద్దు చేసినప్పుడు ముందస్తు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులకు రైల్వే శాఖ టికెట్‌ డబ్బులు రీఫండ్‌ చేస్తుంది. అంతేకానీ ప్రయాణానికి సంబంధించి వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయదు. అయితే ఇటీవల ఓ విద్యార్థిని గమ్య స్థానానికి చేర్చడం కోసం రైల్వే శాఖ చేసిన ఓ మంచి పని అందరి మన్ననలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే..

కారు బుక్‌ చేసి.. సయయానికి స్టేషన్‌కు చేర్చి..

ఇవి కూడా చదవండి

గుజరాత్‌కు చెందిన సత్యం గడ్వి.. చెన్నైలోని ఐఐటీ మద్రాసులో ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. ఇటీవల సెలవులు గడిపేందుకు సొంతూరికి వచ్చిన అతడు.. తిరిగి యూనివర్సిటీకి వెళ్లేందుకు రైలు టికెట్‌ బుక్ చేసుకున్నాడు. ఏక్తా నగర్‌ నుంచి వడోదర.. అక్కడి నుంచి చెన్నై వెళ్లేలా మొత్తం రెండు టికెట్లు బుక్‌ చేసుకున్నాడు. అయితే గుజరాత్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏక్తా నగర్‌ – వడోదర మార్గంలో కొన్ని చోట్ల రైలు మార్గం కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఏక్తా నగర్‌ స్టేషన్‌కు వచ్చాక ఈ విషయం తెలుసుకున్న సత్యం వడోదర ఎలా వెళ్లాలా? అని ఆలోచిస్తూ స్టేషన్‌ సిబ్బందిని కలిశాడు. దీంతో అక్కడి రైల్వే సిబ్బంది అతడి కోసం ప్రత్యేకంగా కారు బుక్‌ చేసి వడోదర స్టేషన్‌కు పంపించారు. అక్కడి నుంచి చెన్నై రైలు ఎక్కి గమ్యస్థానానికి చేరుకున్నాడు. కాగా వడోదరలో రైలెక్కిన తర్వాత రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ సత్యం సోషల్‌ మీడియాలో ఓ వీడియోను షేర్‌ చేశాడు. కారు డ్రైవర్‌ కూడా తనను సమయానికి వడోదర స్టేషన్‌కు చేర్చారన్నాడు. లగేజీ కూడా రైల్వే సిబ్బందే తీసుకొచ్చి రైల్లో పెట్టించారని చెబుతూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ వీడియోను వడోదర డీఆర్‌ఎం ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో రైల్వే శాఖపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రయాణికుల క్షేమం కోసం రైల్వే శాఖ మంచి పనిచేసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..