Indian Railway: ట్రైన్ జర్నీ చేస్తున్నారా..? ప్రతీఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
రైలు ప్రయాణం చేస్తున్నారా..? అత్యవసర ఆరోగ్య పరిస్థితి ఎదురైందా..? ఆకస్మాత్తుగా ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యారా..? ఇలాంటి సమయంలో ఏం చేయాలనేది చాలామందికి అవగాహన ఉండదు. అయితే ప్రయాణికుల భద్రత కోసం రైల్వేశాఖ వైద్య సహాయం అందిస్తోంది. ఇది ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.

ఇండియాలో రైళ్లల్లో ప్రయాణించేవారు ఎక్కువమంది ఉంటారు. దేశ నలుమూలలకు రైల్వే నెట్వర్క్ విస్తరించి ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ రైల్వే నెట్వర్క్ కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. తరచూ లక్షల మంది రైల్వేల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక దూరపు ప్రాంతాలకు వెళ్లేవారికి రైలు ప్రయాణం అనేది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం వందే భారత్ ఎక్స్ప్రెస్ లాంటి ప్రీమియం రైళ్లు కూడా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రావడంతో లగ్జరీ ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే రైళ్లల్లో సడెన్గా అస్వస్థతకు గురైతే ఏం చేయాలో చాలామందికి అవగాహన ఉండదు. గుండెనొప్పి లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కదులుతున్న ట్రైన్లో ఏం చేయాలనేది తెలియదు. అత్యవసర పరిస్ధితి ఎదురైనప్పుడు రైళ్లల్లో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం.
139కి కాల్ చేయండి
రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు కదులుతున్న ట్రైన్లో ఎమర్జెన్సీ సిట్యూయేషన్ ఎదురైనప్పుడు రైల్వే హెల్ప్లైన్ నెంబర్ 139కి కాల్ చేయాలి. ఈ నెంబర్ మీకు 24 గంటలు ఎప్పుడైనా అందుబాటులోకి ఉంటుంది. కాల్ చేయగానే సిబ్బంది వెంటనే స్పందించి రైల్వే కంట్రోల్ రూమ్కి మీ సమాచారం అందిస్తారు. వెంటనే మీకు సహాయక సిబ్బంది వచ్చి సహాయం అందిస్తారు. మీ రైలు నెంబర్, సీటు, కోచ్ నెంబర్ వివరాలు అందించడం ద్వారా త్వరగా సహాయం పొందవచ్చు. ఇక మీ ఫోన్లో సిగ్నల్ లేకపోతే టీటీఈ లేదా రైలు గార్డ్ను సంప్రదించి సహాయం పొందవచ్చు. తదుపరి స్టేషన్కు మీ రైలు చేరుకునే సమయానికి వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు.
డాక్టర్ ఫీజు ఎంత ఉంటుందంటే..?
ఇక రైల్వే వ్యవస్థ ద్వారా సహాయం పొందాలంటే డాక్టర్ ఫీజు రూ.100 ఉంటుంది. చిన్న ఆరోగ్య సమస్య అయితే మెడిసిన్స్ కూడా ఉచితంగా అందిస్తారు. ఇక పెద్ద ఆరోగ్య సమస్యకు అయితే మెడిసిన్స్కు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు. ఇక గుండెపోటు లాంటి అత్యవసర పరిస్థితుల్లో అయితే రైల్వే అధికారులు అంబులెన్స్ సిద్దం చేసి ఉంచుతారు. వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు.
