Rains: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వరదలతో సతమతం
ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు ఏమాత్రం వీడడంలేదు. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, త్రిపురలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా.. రాజస్థాన్లోని గంగాపూర్ జిల్లాను భారీ వర్షం ముంచెత్తింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో ఏకంగా ఊర్లకు ఊర్లే చెరువులుగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే.. రాజస్థాన్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాజస్థాన్లోని గంగాపూర్ జిల్లా వరద విలయంలో చిక్కుకుంది. గంగాపూర్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లు, దుకాణాల్లోకి భారీగా వరదనీరు ప్రవేశించింది. వందల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత మూడు రోజులుగా గంగాపూర్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక.. రాబోయే ఐదారు రోజుల వరకు జైపూర్, అజ్మీర్, కోట, ఉదయ్పూర్, భరత్పూర్ డివిజన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ రాజస్థాన్లోని బికనీర్, జోధ్పూర్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఇదిలావుంటే.. ఉత్తర భారతాన్ని వర్షాలు వణికిస్తూనే ఉన్నాయి. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ చేసింది. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. ప్రధానంగా.. హిమాచల్ప్రదేశ్లో భారీ వర్షాలతో రెండు రోజులపాటు ఆరెంజ్, 15వరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆకస్మిక వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు.. దేశ దాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురిసింది. ఢిల్లీలో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మొత్తంగా.. దేశవ్యాప్తంగా ఉత్తరాదితోపాటు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.