AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉల్లి కొనుగోలు దారులకు గుడ్ న్యూస్.. అది ఏమిటంటే..?

సంచితో డబ్బులు తీసుకెళితే.. దోసిలితో సరుకులు తెచ్చుకోవాల్సి రోజులివి. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామన్య, మధ్యతరగతి జీవికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలతో సంసారాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధంకాక మహిళలు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కిలో 20 రూపాలుండే ఉల్లిధరలు ఏకంగా రూ. 40, రూ.50 దాటి రూ.80 లకు చేరడంతో ఆందోళన మరింత పెరిగింది. ఉల్లి వాసనలేని ఇల్లు ఉండదు. ఉల్లి లేని వంటకం […]

ఉల్లి కొనుగోలు దారులకు గుడ్ న్యూస్.. అది ఏమిటంటే..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 12:15 PM

Share

సంచితో డబ్బులు తీసుకెళితే.. దోసిలితో సరుకులు తెచ్చుకోవాల్సి రోజులివి. రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామన్య, మధ్యతరగతి జీవికి పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలతో సంసారాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధంకాక మహిళలు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కిలో 20 రూపాలుండే ఉల్లిధరలు ఏకంగా రూ. 40, రూ.50 దాటి రూ.80 లకు చేరడంతో ఆందోళన మరింత పెరిగింది.

ఉల్లి వాసనలేని ఇల్లు ఉండదు. ఉల్లి లేని వంటకం కూడా లేదు. ప్రధాన నిత్యావసర సరుకుల్లో ఒకటైన ఉల్లిగడ్డల ధర అమాంతం పెరిగడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. విపరీతంగా పెరిగిన ఉల్లిధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. భారీ వర్షాల కారణంగా ఈసారి ఉల్లి పంట సాగు విస్తీర్ణాన్ని బాగా తగ్గించారు. దీంతో దీని దిగుబడి తగ్గిపోయింది. మరోవైపు మన దేశం నుంచి ఇతర దేశాలకు సైతం ఉల్లి ఎగుమతులు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ కారణం వల్ల కూడా స్ధానిక మార్కెట్లలో ధరలకు రెక్కలొచ్చాయి. ప్రజలకు అందకుండా పోతున్న ఉల్లి ధరలపై కేంద్రం బ్రేక్ వేయడంతో ధరలు దిగివచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఉల్లి ఎగుమతులను నిషేదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మన దేశంలో ఉల్లి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద హోల్‌సేల్ ఉల్లిమార్కెట్ మహారాష్ట్రలోని లాసాల్‌గావ్‌లో ఉంది. ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు భారీగా జరుగుతాయి. ఇక్కడ గత వారం దాదాపు రూ.60 వరకు పలికిన ధర.. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న చర్యలతో రూ.30 వద్ద నిలకడగా కొనసాగుతుంది. దీంతో ఇక్కడి ధరలే మిగిలిన మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. తద్వారా బయట కూడా క్రమంగా ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాసాల్‌గావ్ మార్కెట్ దేశవ్యాప్తంగా ఉల్లి ధరలను నిర్దేశిస్తుంది. లాసాల్‌గావ్ వ్యవసాయ మార్కెట్లో గురువారం ఉల్లి సగటు టోకు ధర రూ.26 కాగా, గరిష్టంగా కిలో ఉల్లి ధర రూ.30.20 పైసలు, కనిష్ట ధర రూ.15 గా ఉంది.

ఇటీవల దేశ వ్యాప్తంగా విపరీతంగా వర్షాలు కురిసాయి. ముఖ్యంగా ఉల్లిని సాగుచేస్తున్న మహారాష్ట్ర,కర్ణాటక, మధ్యప్రదేశ్, ఏపీలోని కర్నూలు ప్రాంతాల్లో ఉల్లి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. పైగా పండించిన పంట కూడా దెబ్బతింది. దీంతో అప్పటికే మార్కెట్లో ఉన్న ఉల్లి ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి. ముఖ్యంగా దీన్ని కొనుగోలు చేసి గొడౌన్‌లకు తరలించే ఏజెంట్లు .. ఈ ధరలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. దీంతో అధిక ధర చెల్లించి 5 కిలోలు కొనుగోలు చేయాల్సిన చోట 2 కిలోలు, 2 కిలోలు కొనేవాళ్లు.. కనీసం ఒక్క కిలో కొనేందుకు పరిమితమయ్యారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో సామన్యులకు ఉపశమనం కలిగినట్టయ్యింది. అయితే ధరలు ఎంత పెరిగినా లాభం మాత్రం మధ్యనున్న దళారీకి మాత్రేమే రావడం ఇక్కడ ఆలోచించవలసిన అంశం. కష్టపడి పండించిన రైతుకు.. పెరిగిన ధరలకు ఎక్కడా సంబంధం లేకపోవడం దురదృష్టకరం. డిమాండ్‌ను బట్టి దాన్ని క్యాష్ చేసుకోవడంలో దళారుల పాత్ర అధికంగా ఉంది.

గతంలో కూడా ఉల్లి ధరలు విపరీతంగా పెరిగిన సందర్భాలున్నాయి. ఈవిధంగా ఉల్లిధరలు పెరగడం అనేది రాజకీయాల్లో కీలకంగా మారింది. దీన్ని వెంటనే నివారించకపోతే ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశాలున్నందున కేంద్రం ప్రభుత్వం ముందుకు రావడం మంచిదే. అయితే కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ తగ్గిన ధరలు అందుబాటులోకి రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఎగుమతులపై నిషేదం విధించి ధరలకు కళ్లెం వేసినా.. హైదరాబాద్‌ సహా పలు పట్టణాల మార్కెట్లలో ఇప్పటికీ రూ.40 లుగా ఉల్లిని అమ్ముతుండటంపై సామన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.