డ్రగ్స్ ఉచ్చులో శాండిల్ వుడ్ ఇండస్ట్రీ !
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం, ఇప్పుడు శాండిల్ వుడ్ మెడకు చుట్టుకుంటోంది. కన్నడలో టాప్ హీరోయిన్ రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.
డ్రగ్స్ వ్యవహారం.. మరోసారి సినీ ఇండస్ట్రీలను కుదిపేస్తోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణంతో తెరపైకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారం.. ఇప్పుడు శాండిల్ వుడ్ మెడకు చుట్టుకుంటోంది. కన్నడలో టాప్ హీరోయిన్ రాగిణి ద్వివేదిని అరెస్ట్ చేయడం.. మరో హీరోయిన్ సంజనకు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కూపీ లాగిన సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. డ్రగ్స్ డొంకను కదిలించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు సీసీబీ అధికారులు 20 మందిని విచారించినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 21న ఓ డ్రగ్స్ సప్లయర్ అరెస్ట్తో..శాండల్ వుడ్ లింకులు బయటపడ్డాయి. బెంగళూరు శివారులోని రాయల్ సూట్స్ హోటల్లో NCB అధికారులు సోదాలు చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అతని ఫోన్లో శాండల్వుడ్కు చెందిన పలువురు పేర్లు ఉండడంతో ఆ దిశగా ఎంక్వైరీ చేశారు..
ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు వీరేన్ ఖన్నాను అరెస్ట్ చేశారు సీసీబీ అధికారులు. వీరేన్ ఖన్నా సెలబ్రిటీలకు డ్రగ్స్ పంపిణీ చేసేవాడని విచారణలో తేలింది. బెంగళూరులో పార్టీ ఆర్గనైజర్గా కెరీర్ స్టార్ట్ చేసిన వీరేన్..సెలబ్రిటీస్తో పరిచయాలు పెంచుకున్నాడు. ఆ తర్వాత వీరేన్ ఖన్నా ప్రొడక్షన్స్ ప్రారంభించి.. కన్నడ స్టార్స్కు డ్రగ్స్ సప్లై చేసేవాడని ఆరోపణలున్నాయి. ఇతనిచ్చే హైక్లాస్ పార్టీలకు.. ఇండస్ట్రీలోని కీలక వ్యక్తులంతా హాజరయ్యే వారని పోలీసులు గుర్తించారు. ఈ పార్టీల్లోనే భారీగా డ్రగ్స్ సప్లై అయినట్లు తేల్చారు. దీంతో వీరేన్ను కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తున్నారు.
మరోవైపు రాగిణి ఫ్రెండ్ రవిశంకర్కు డ్రగ్స్ డీలర్స్తో సంబంధాలు బయటపడ్డాయి..అప్పటినుంచి రవిశంకర్పై నిఘా పెట్టిన సీసీబీ అధికారులు..అతన్ని గురువారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని 5 రోజుల కస్టడీకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అతనిచ్చిన సమాచారంతోనే హీరోయిన్ రాగిణి ద్వివేదిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
శుక్రవారమే విచారణకు హాజరు కావాలంటూ రాగిణి నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే.. ఆమె సోమవారం వరకూ టైమ్ అడగడం.. వాట్సప్ నెంబర్ను మార్చడంతో అనుమానం వచ్చి.. ఆమె ఇంట్లో ఆకస్మిక సోదాలు చేశారు. నాలుగు గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. సోదాల అనంతరం రాగిణి ద్వివేదిని అదుపులోకి తీసుకున్న అధికారులు..సీసీబీ హెడ్క్వార్టర్స్కు తీసుకువెళ్లారు. 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం..శాండల్వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. మరింత లోతుగా విచారించేందుకు ఆమెను 14 రోజుల కస్టడీ కోరనున్నారు. ఐతే రాగిణి ఇప్పటికే బెంగళూరు సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇక ఈ డ్రగ్స్ వ్యవహారంలో నటి సంజనకు సన్నిహితుడైన రాహుల్కు సంబంధాలున్నాయని తేలడంతో అతన్ని కూడా అరెస్ట్ చేశారు సీసీబీ అధికారులు. రాహుల్తో పాటు ఈ వ్యవహారంలో సంజన పాత్ర ఏ మేరకు ఉందనే దానిపై ఫోకస్ పెట్టి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సంజనకు కూడా సమన్లు జారీ చేశారు. అయితే శాండల్వుడ్ డ్రగ్ రాకెట్తో తనకెలాంటి సంబంధం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు నటి సంజన. మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిరాధారం అంటున్నారామె.
శాండల్వుడ్ డ్రగ్ రాకెట్ కేసులో నటి రాగిణి ద్వివేది అరెస్ట్, హీరోయిన్ సంజనాకు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఐతే ఇది ట్రైలర్ మాత్రమేనని..మున్ముందు మరింతమంది కన్నడ నటీనటులు అరెస్టయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీంతో సీసీబీ హిట్లిస్ట్లో ఇంకెంతమంది ఉన్నారోనని శాండల్వుడ్ స్టార్స్ వణికిపోతున్నారు.