కోళ్ల ఫారం ముందు డీజే సౌండ్ హోరుతో పెళ్లి ఊరేగింపు.. కట్చేస్తే లోపలున్న కోళ్లన్నీ..
శబ్ద కాలుష్యం మనుషులకే కాదు, మూగజీవాలకు కూడా ప్రాణాంతకమని నిరూపించే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో వెలుగు చూసింది. పెళ్లి ఊరేగింపులోని డీజే సౌండ్కు 140 కోళ్లు చనిపోయాయంటూ ఒక ఫారం యజమాని పోలీసులను ఆశ్రయించారు. అసలు పెద్ద శబ్దాలకు కోళ్లు ఎందుకు చనిపోతాయి? సైన్స్ ఏం చెబుతోంది? అనేది తెలుసుకుందాం..

పెళ్లి ఊరేగింపు అంటే బ్యాండ్ బాజా, డీజే హోరు కామన్గా మారిపోయింది. కానీ అదే డీజే సంగీతం ఇప్పుడు వందలాది మూగజీవుల ప్రాణాలను బలితీసుకుంది. పెద్ద శబ్దం కారణంగా ఏకంగా 140 కోళ్లు చనిపోయాయంటూ ఒక పౌల్ట్రీ ఫారం యజమాని పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో కలకలం రేపింది. సుల్తాన్పూర్ జిల్లాలోని రామ్ భద్ర పూర్వ గ్రామానికి చెందిన సాబిర్ అలీ అనే వ్యక్తి పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి, బాబన్ విశ్వకర్మ కుమార్తె వివాహ ఊరేగింపు సాబిర్ ఫారం ముందు నుండి వెళ్లింది. ఆ సమయంలో డీజే ఆపరేటర్ కవి యాదవ్ పెట్టిన భారీ శబ్దానికి కోళ్లు వింతగా ప్రవర్తించాయని, భయంతో ఒకదానిపై ఒకటి పడి కుప్పలుగా చనిపోయాయని సాబిర్ అలీ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
చెప్పినా వినలేదు..
సుమారు రాత్రి 9:30 గంటల సమయంలో డీజే సౌండ్ తగ్గించమని తాను వేడుకున్నా ఊరేగింపులో ఉన్నవారు వినలేదని, ఫలితంగా 140 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయని ఆయన ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు డీజే ఆపరేటర్ కవి యాదవ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పెద్ద శబ్దానికి కోళ్లు ఎందుకు చనిపోతాయి?
సాధారణంగా పక్షులకు శబ్ద గ్రాహక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. డీజే నుండి వెలువడే అధిక తీవ్రత గల ధ్వని తరంగాలు వాటిపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు..
తీవ్రమైన ఒత్తిడి: ఊహించని పెద్ద శబ్దాలు కోళ్లలో అత్యంత ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ సమయంలో వాటి శరీరంలో అడ్రినలిన్ హార్మోన్ విపరీతంగా విడుదలవుతుంది.
గుండెపోటు: ధ్వని తరంగాల ఫ్రీక్వెన్సీ పెరిగినప్పుడు పక్షుల గుండె వేగం అసాధారణంగా పెరుగుతుంది. దీనివల్ల అవి భయంతో గుండెపోటుకు గురై నిమిషాల్లోనే చనిపోతాయి.
పైలింగ్ అప్: పెద్ద శబ్దాలు విన్నప్పుడు కోళ్లు భయంతో గదిలోని ఒక మూలకు పరుగెత్తుతాయి. ఆ క్రమంలో ఒకదానిపై ఒకటి పడి ఊపిరాడక మరణిస్తాయి.
పోలీసుల దర్యాప్తు.. నిపుణుల హెచ్చరిక
సంగీతం అనుమతించదగిన శబ్ద స్థాయి ని మించి ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన కోళ్లను పరీక్షల నిమిత్తం పంపారు. శబ్ద కాలుష్యం కేవలం మనుషులకే కాదు, పక్షులు, జంతువులకు కూడా ప్రాణాంతకమని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. జంతు ప్రదర్శనశాలలు లేదా పౌల్ట్రీ ఫారాల సమీపంలో డీజేలు, టపాసులపై ఆంక్షలు విధించాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.
