Tamilnadu Temple: అమ్మవారి ప్రసాదం పులిహోరలో చచ్చిన పాము పిల్ల.. షాక్ తిన్న భక్తులు..
పుణ్యక్షేత్రాల్లోని దేవాలయలైనా.. ఇంటి సమీపంలో ఉన్న ఆలయాల్లోనైనా సరే భక్తులు దేవుడిని దర్శించుకుని పూజలు ముగించుకున్న తర్వాత.. దేవుడి ప్రసాదాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో స్వీకరిస్తారు. అలా ఓ అమ్మవారి అలయంలోని పులిహోర ప్రసాదాన్ని తీసుకున్న భక్తుడికి షాక్ తగిలింది. ఎందుకంటే అమ్మవారి ప్రసాదంలో చనిపోయిన పాము పిల్ల కనిపించింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఈ సంఘటనపై భక్తుడు ఫిర్యాదు చేయడంతో..మొత్తం ప్రసాదాన్ని పారవేసి ఆలయ సిబ్బంది దర్యాప్తు ప్రారంభించింది.

తమిళనాడులోని హోసూర్ లో కొండపైన ఆలయంలో చంద్ర చౌడేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారిని రోజూ భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయ ప్రాంగణంలో పులిహోర, దద్దోజనాన్ని ప్రసాదంగా వితరణ చేస్తారు. అయితే మంగళవారం చంద్ర చూడేశ్వరీ ఆలయంలో భక్తులకు పంపిణీ చేసిన ‘పులిహోర’ ప్రసాదంలో చనిపోయిన పాము పిల్ల కనిపించింది.
ఈ ఆలయాన్ని హిందూమత ధార్మిక ధార్మిక (HR&CE) విభాగం నిర్వహిస్తుంది. మంగళవారం బెంగళూరులోని బొమ్మసంద్రకు చెందిన సి మదానిక తన స్నేహితురాలు జయలక్ష్మితో కలిసి ఆలయాన్ని సందర్శించి దేవత దర్శనం చేసుకుంది. దర్శనం తర్వాత ఆమె ప్రసాదంగా పులిహోర ప్యాకెట్ ను తీసుకుంది. తిందామని ప్యాకెట్ ఓపెన్ చేయగానే ప్యాకెట్ లో చచ్చిపోయిన పాము పిల్ల కనిపించడంతో షాక్ అయ్యింది. ప్రసాదంలో పాము పిల్ల కనిపించడంతో ఆమె భయపడింది. “మొదట దానిని తాను పురుగు అని అనుకున్నాను” అని చెప్పింది.
అయితే తన ఫ్రెండ్ అది పురుగు కాదు చనిపోయిన పాము పిల్ల చెప్పింది. ఈ విషయంపై ప్రసాదం కౌంటర్ సిబ్బందిని ప్రశ్నించగా.. నిర్లక్ష్యంగా సమాదానం ఇచ్చినట్లు చెప్పింది భక్తురాలు. దీంతో ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎం సమిదురైకి ఫిర్యాదు చేసి.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపింది. పులిహోరలో పాము విషయం తెలియగానే ఆలయానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.
ఈ విషయం పై ఆలయ నిర్వహణ సిబ్బంది మాట్లాడుతూ.. “ఆలయ ప్రసాద సరఫరా కోసం మేము వార్షిక టెండర్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సంవత్సరం వరుసగా ఐదవసారి తిరుచ్చికి చెందిన వాసుదేవన్కు రూ. 5 లక్షలకు టెండర్ దక్కించుకున్నట్లు వెల్లడించారు సమిదురై.
హోసూర్ ఆహార భద్రతా అధికారి (FSO) ముత్తు మరియప్పన్ ప్రసాదాల తయారీ కేంద్రంలో పరిశీలించి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు అధికారులు. ప్రసాదం తయారీ చేసే స్థలంలో సౌకర్యం పరిశుభ్రత సరిగా లేదని గమనించినట్లు చెప్పారు. అంతేకాదు ప్రసాదాన్ని పరిశుభ్రంగా అందించేందుకు ఆహారంలో జుట్టు పడకుండా ఉండటానికి వంటగది సిబ్బంది హ్యాండ్ గ్లోవ్స్, డిస్పోజబుల్ క్యాప్లు ధరించడం లేదని గుర్తించినట్లు వెల్లడించారు. టగదిలో పరిశుభ్రత లోపానికి వివరణ కోరుతూ బుధవారం వాసుదేవన్కు షో-కాజ్ నోటీసు జారీ చేస్తాము” అని FSO పేర్కొంది. అతను సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని నొక్కి చెప్పారు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..