వామ్మో.. మాయదారి వైరస్ల స్వైర విహారం.. జనం గుండెల్లో భయం భయం..!
కరోనా వేరియంట్లతో పాటు వివిధ రకాల వ్యాధులు, వైరస్లు మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ పూర్తి కనుమరుగు కాకుండానే రోజుకో కొత్త వేరియంట్ రూపంలో దాపురిస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ వార్త అందరిలోనూ మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. నిన్ను వీడని నీడను నేనే.. అంటూ వరుస మాయదారి వైరస్లు..
![వామ్మో.. మాయదారి వైరస్ల స్వైర విహారం.. జనం గుండెల్లో భయం భయం..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/virus-fears-in-india1.jpg?w=1280)
కరోనా.. ఈ పేరు వింటే చాలు జనం ఉలిక్కిపడుతున్నారు. ఒక్కసారిగా భయం ఆవహిస్తుంది. వెన్నులో వణుకు మొదలవుతుంది. ఆ మహమ్మారి సృష్టించిన విధ్వంసం అలాంటిది మరి. నాటి చేదు అనుభవాలు పీడకలగా మానవజాతిని వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆ దేశం ఈ దేశం అని లేకుండా కరోనా మహమ్మారి దాదాపు అన్ని దేశాల్లో స్వైర విహారం చేసింది. కరోనా వైరస్ కొత్త రకం వేరియంట్లు ఇప్పటికీ వైలెంట్గా, డేంజరస్గా పంజా విసురుతూనే ఉన్నాయి.
కరోనా వేరియంట్లతో పాటు వివిధ రకాల వ్యాధులు, వైరస్లు మనల్ని భయపెడుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ పూర్తి కనుమరుగు కాకుండానే రోజుకో కొత్త వేరియంట్ రూపంలో దాపురిస్తున్నాయి. ఇప్పుడు మరో షాకింగ్ వార్త అందరిలోనూ మరిన్ని భయాలు క్రియేట్ చేస్తున్నాయి. నిన్ను వీడని నీడను నేనే.. అంటూ వరుస మాయదారి వైరస్లు బయటపడుతుండటంతో దేశంలో ఇప్పటికే మరో పాండమిక్ మొదలైపోయిందన్న అనుమానాలు భయపెడుతున్నాయి. ఒకటికాదు.. రెండుకాదు.. దాదాపు అర డజను వైరస్లు వదల బొమ్మాళీ వదలా అంటూ ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.
కొత్త వైరస్లు పలు రాష్ట్రాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కేరళలో నిఫా, మహరాష్ట్రలో జికా వైరస్, గుజరాత్, రాజస్థాన్లో చండీపురా వైరస్ మరణాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు ఈ మాయదారి వైరస్లను ఎదుర్కోవడం ఆయా రాష్ట్రాలతో పాటు యావత్ దేశానికి సవాలుగా మారుతోంది. ఈ వైరస్లు వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం ఏమి చెబుతుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. అటు వరుస వైరస్లను ఎదుర్కొనేందుకు భారత్ ఏం చేయబోతోందని ఇతర దేశాలు కూడా భారత్ వైపు చూస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా వ్యాధులు కూడా దండయాత్ర చేస్తున్నాయి.
చండీపురాతో గజగజ వణికిపోతున్న గుజరాత్..
గుజరాత్ సబర్కాంతా జిల్లాలో చండీపురా అనే కొత్త రకం వైరస్ (CHPV) కలకలం సృష్టిస్తోంది. 101 మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడగా.. వారిలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు, యువకులే ఎక్కువ మంది ఉన్నారు. గుజరాత్లో రోజు రోజుకూ ఈ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో 13 కొత్త కేసులు నిర్థారణ అయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో ఈ వైరస్ సోకి ఓ వ్యక్తి మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది.
చండీపురా వైరస్ గుజరాత్తో పాటు దాని పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కూడా వ్యాపించింది. గత రెండు దశాబ్ధాల కాలంలో అత్యధిక తీవ్రతతో ఈ వైరస్ విజృంభిస్తోంది. పిల్లలకు వ్యాపించే ఈ ప్రాణాంతక వైరస్.. ఫ్లూ వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. దోమలు, ఈగలు ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. బాధితులకు చికిత్స అందించడంలో ఆలస్యమైతే ప్రాణాంతకం కావచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చండీపురా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో గుజరాత్ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధక చర్యలు చేపట్టింది. 15 ఏళ్ల లోపు చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలుంటే తక్షణమే తమ దగ్గరిలోని ఆస్పత్రులకు తీసుకెళ్లాలని ఆరోగ్య శాఖ అధికారులు కోరారు. అటు.. రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాలోని రెండు గ్రామాల్లో చండీపురా వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అలెర్ట్ అయ్యింది. అటు మహారాష్ట్రలోనూ చండీపురా వైరస్ పట్ల అలెర్ట్ కొనసాగుతోంది.
![Virus Fears In India2](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/virus-fears-in-india2-1024x576.jpg)
Virus Fears In India
మహారాష్ట్రలోని ఓ గ్రామం పేరుతో చండీపురా వైరస్కి ఆ పేరు వచ్చింది. 1965లో ఈ వైరస్ బయటపడింది. ఈ వైరస్కి రాబిస్కు కారణమయ్యే వైరస్లతో దగ్గరి సంబంధం ఉంది. చండీపురా వైరస్ ప్రభావంతో ముఖ్యంగా పిల్లలకు అధిక జ్వరం, మూర్ఛలు, అతిసారం, వాంతులు అకస్మాత్తుగా ప్రారంభమవుతాయి. చండీపురా వైరస్ ప్రభావం తీవ్రమైన సందర్భాల్లో బాధితులు కోమా లేదా మరణానికి దారితీసే ప్రమాదముంది. ఈ వైరస్ బాధితులకు ఓ నిర్దిష్టమైన యాంటీవైరల్ చికిత్స లేదు. అందుకే చండీపురా వైరస్ పేరు వింటే ఇప్పుడు గుజరాత్ గజగజ వణికిపోతోంది. అటు తాజాగా జార్ఖండ్లోనూ తొలి చండీపురా వైరస్ మరణం నమోదయ్యింది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై ఫోకస్ చేసింది.
మహారాష్ట్రలో జికా భయాలు..
మరోవైపు జికా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గర్భిణీ స్త్రీలు, వారికి పుట్టబోయే పిల్లలపై జికా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలే తీసేస్తుంది. ప్రధానంగా దోమ కాటు ద్వారా, అలాగే రక్తమార్పిడి, లైంగిక సంపర్కం, తల్లి పాలివ్వడం ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుంది. మహారాష్ట్ర 2021 నుంచే జికా వైరస్ కేసులతో పోరాడుతోంది. జూలై 19 నాటికి ఆ రాష్ట్రంలో అత్యధికంగా 38 జికా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఒక్క పూణె నగరంలోనే ఇప్పటి వరకు 33 జికా వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
గతంలో కేరళలో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. జికా వైరస్ను మొదట కేరళ రాష్ట్రంలోనే గుర్తించారు. ఇటు కర్ణాటకలో జికా వైరస్ కారణంగా మరణం సంభవించింది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే జికా వైరస్..దేశ హెల్త్ కేర్ వ్యవస్థలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
కేరళలో నిఫా కలకలం..
ఇక కేరళను వణికిస్తున్న మరో మాయదారి వైరస్ నిఫా. ఈ నెల 21న మలప్పురానికి చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి కేరళలో కలకలం సృష్టిస్తోంది. దాదాపు ఏడాది తర్వాత ఆ రాష్ట్రంలో ఇప్పుడు నిఫా విజృంభిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిఫా వైరస్ని జూనోటిక్ వైరస్గా నిర్ధారించింది. అంటే ఇది జంతువుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. ఇది కలుషితమైన ఆహారం లేదా ప్రత్యక్షంగా వ్యక్తి నుంచి వ్యక్తికి వ్యాపిస్తుంది. గబ్బిలాల లాలాజలం లేదా మూత్రం ద్వారా కలుషితమైన పండ్లను తినడం ద్వారా నిఫా వైరస్ సోకుతుంది. నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన గంటల వ్యవధిలోనే ఆ బాలుడు చనిపోవడం కేరళలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆ బాలుడి కుటుంబీకులు సహా కాంటాక్ట్లో ఉన్న 17 మందికి నిర్వహించిన సీరమ్ పరీక్షల్లో నెగటివ్ రిపోర్ట్ రావడంతో కేరళ ప్రభుత్వం కాస్త ఊపిరిపీల్చుకుంది. అయితే వారితో సహా మొత్తం 460 మందిని 21 రోజుల పాటు ఐసొలేషన్లోనే ఉంచాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. నిఫా ప్రొటోకాల్ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వార్నింగ్ ఇచ్చారు.
![Virus Fears In India4](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/virus-fears-in-india4-1024x576.jpg)
Virus Fears In India
కేరళలో నిఫా విజృంభిస్తుండటంతో తమిళనాడు రాష్ట్రం అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే నిఫా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ కూడా దృష్టిసారించింది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ కూడా జారీచేసింది.
ప్రాణాంతక వైరస్లు విజృంభిస్తుండటం మనిషి ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటిని ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యాక్సిన్ల తయారీపై దృష్టిసారించాల్సిన అవసరముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![Virus Fears In India3](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/virus-fears-in-india3-1024x576.jpg)
Virus Fears In India
హైదరాబాద్ నార్వాక్..
అటు హైదరాబాద్లో నార్వాక్ వైరస్ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి నార్వాక్ బాధితులు క్యూ కడుతున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే… ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నారులకు ఈ వైరస్ ప్రాణాంతకంగా మారుతోంది. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీళ్లు తీసుకోవడం వల్ల ఈ వైరస్ ప్రబలుతుందని వైద్యులు అంటున్నారు . తీవ్రమైన డీహైడ్రేషన్, నిస్సత్తువ, ఏం తినలేని పరిస్థితి ఉంటే మాత్రమే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించాలని చెబుతున్నారు.
అటు దేశంలో బర్డ్ ఫ్లూ, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. బర్డ్ ఫ్లూ సోకడంతో ఆరుగురు చిన్నారులు కోల్కత్తాలోని పార్క్ సర్కస్ చిల్డ్రన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అటు బెంగుళూరులో డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి రోజూ 150 డెంగ్యూ పాజిటివ్ కేసులు రికార్డు అవుతున్నాయి. డెంగ్యూ నివారణపై నగర ప్రజల్లో అవగాహన కల్పించేలా సోషల్ మీడియాలో రీల్స్ రూపొందించే వారికి ప్రత్యేక నగదు బహుమతి అందజేయనున్నట్లు బృహత్ బెంగుళూరు మహానగర పాలికె(బీబీఎన్పీ) అధికారులు ప్రకటించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరస్ వర్రీ గుబులు రేపుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కూడా వైరస్ల వ్యాప్తికి కారణమవుతున్నాయి. ఫ్లూ బారినపడిన రోగులతో హైదరాబాద్ నగరంలోని దవాఖానాలు కిటకిటలాడుతున్నాయి.