G-20 Summit: జీ20 సదస్సు ఏర్పాట్లపై రేపు అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న ప్రధాని మోడీ సహా 40 పార్టీల నేతలు..

|

Dec 04, 2022 | 1:55 PM

భారత్‌లో వచ్చే ఏడాది సెప్టెంబరులో జరగనున్న జీ-20 సదస్సు కోసం కేంద్రం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. జీ20 - 2023 సదస్సునకు సంబంధించి లోగో, వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే.

G-20 Summit: జీ20 సదస్సు ఏర్పాట్లపై రేపు అఖిలపక్ష సమావేశం.. హాజరుకానున్న ప్రధాని మోడీ సహా 40 పార్టీల నేతలు..
G20 Summit
Follow us on

G-20 Summit in India: భారత్‌లో వచ్చే ఏడాది సెప్టెంబరులో జరగనున్న జీ-20 సదస్సు కోసం కేంద్రం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. జీ20 – 2023 సదస్సునకు సంబంధించి లోగో, వెబ్‌సైట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రారంభించిన విషయం తెలిసిందే. జీ20 – 2023 సదస్సుకు సంబంధించి ఇప్పటికే.. ఇండోనేషియా నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన భారత్.. దానిని విజయవంతం చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో జీ-20 సదస్సుకు సంబంధించి సలహాలు, సూచనలు, చర్చలు, వ్యూహాలను ఖరారు చేసేందుకు కేంద్రం.. సోమవారం అఖిలపక్ష సమావేశాకి పిలుపునిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యే ఈ సమావేశానికి దాదాపు 40 పార్టీల అధ్యక్షులను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆహ్వానించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హాజరయ్యే అవకాశముంది.

కాగా.. భారతదేశం అధికారికంగా డిసెంబర్ 1న జి-20 అధ్యక్ష బాధ్యతలను స్వీకరించింది. ఇండోనేషియా బాలీలో ఇటీవల జరిగిన జీ20 శిఖారగ్ర సమావేశం ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోడీ.. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించారు. జీ20 అధ్యక్ష బాధ్యతను స్వీకరించడం ప్రతి భారతీయ పౌరుడికి గర్వకారణమని ఇటీవల లోగో విడుదల సందర్భంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జి-20 సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో సదస్సు నిర్వహణపై దేశంలోని పలు ప్రాంతాల్లో కేంద్రం సమావేశాలు ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 200 సమావేశాలను నిర్వహించి పలు సలహాలు, సూచనలను కేంద్రం స్వీకరించనుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి పలు దేశాల దేశాధినేతలు లేదా ప్రతినిధులు హాజరుకానున్నారు.

కాగా.. జీ-20 సదస్సు సన్నాహాక సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సైతం హాజరుకానున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ఢిల్లీకి చేరుకోనున్నారు. అయితే తాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కాకుండా, తృణమూల్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ హోదాలో ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటానని మమత వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

జీ-20 లేదా.. ‘గ్రూప్ ఆఫ్ 20’ అనేది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల అంతర్గత ఉమ్మడి వేదిక. ఈ జీ20 లో ఇండియా, అమెరికా, రష్యా, చైనా, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం..