BJP vs AAP: ఆప్ – బీజేపీ మధ్య సరికొత్త వివాదం.. మోర్బీ దృష్టి మరల్చడానికే ఈ డ్రామా: కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీలో ఆప్ -బీజేపీ పార్టీల మధ్య కొత్త వివాదం మొదలయ్యింది. తీహార్ జైల్లో ఉన్న మాయగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.

ఢిల్లీలో ఆప్ -బీజేపీ పార్టీల మధ్య కొత్త వివాదం మొదలయ్యింది. తీహార్ జైల్లో ఉన్న మాయగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్కు తాను రూ.10 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు తన లాయర్ ద్వారా లేఖ రాశారు. మంత్రి సత్యేంద్రజైన్ కూడా మనీలాండరింగ్ కేసులో ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించడానికి సత్యేంద్ర జైన్ తన నుంచి డబ్బులు డిమాండ్ చేశారని సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు రూ. 50 కోట్లు ఇస్తే తనకు రాజ్యసభ టిక్కెట్ ఇస్తామని ఆప్ నుంచి ఆఫర్ వచ్చినట్టు సంచలన ఆరోపణలు చేశారు సుఖేశ్ చంద్రశేఖర్. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కూడా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు రాసిన లేఖలో సుఖేశ్ పేర్కొన్నారు. కాగా, దీనిపై అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోర్బీ ఘటన నుంచి దృష్టి మరల్చేందుకే సరికొత్త డ్రామా ఆడుతున్నారంటూ బీజేపీపై ఫైర్ అయ్యారు.
ఆప్ పై బీజేపీ ఫైర్..
కాగా.. ఈ ఘటనపై బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీని లక్ష్యంగా చేసుకుంది. సుఖేశ్ చంద్రశేఖర్ నుంచి ఆప్ మంత్రి సత్యేంద్రజైన్కు ప్రతినెల రూ. 2 కోట్లు అందాయని బీజేపీ నేత సంబింద్ పాత్ర ఆరోపించారు. సత్యేంద్రజైన్కు సుఖేశ్ చంద్రశేఖర్ మంచిమిత్రుడని అన్నారు సంబిద్ పాత్ర. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు
మోర్బీ దృష్టి మరల్చడానికే బీజేపీ కొత్త డ్రామా: కేజ్రీవాల్..
అయితే బీజేపీ ఆరోపణలను కొట్టిపారేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. గుజరాత్ ఎన్నికల్లో మోర్బీ వంతెన ప్రమాద ఘటన అంశం నుంచి దృష్టి మరల్చడానికే బీజేపీ కొత్త డ్రామాను తెరపైకి తెచ్చిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సిసోడియాపై కూడా ఆరోపణలు చేశారని, కానీ ఒక్క ఆధారం కూడా లభించలేదన్నారు. ఇంతకంటే దారుణ పరిస్థితి ఏముంటుంది? దాదాపు 150 మంది చనిపోయారు కానీ అన్ని ఛానెల్లు ఒకరి గురించి చర్చిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఇలా చేశారనంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు.




కాగా.. సుఖేశ్ చంద్రశేఖర్కు ప్రాణహని ఉందని, ఆయనకు తీహార్ జైల్లో రక్షణ కల్పించాలని సుప్రీంకోర్టులో సుఖేశ్ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..




