చేలో చెరుకు తింటూ పట్టుబడి.. కరెంట్ స్తంభం వెనుక దాక్కుని.. కళ్లుమూసుకున్న పిల్ల ఏనుగు!
తల్లి ఏనుగు లేకుండా అర్ధరాత్రి ఓ పిల్ల ఏనుగు చెరకు తోటలో దొంగతనానికి వచ్చింది. ఆనక పస పస చెరకు తినసాగింది. ఇంతలో అలికిడికి తోట యజమాని వచ్చేశాడు. దీంతో భయపడిన ఈ ఏనుగు పిల్ల రోడ్డు మీదకు వచ్చి.. ఓ కరెంట్ స్తంభం వెనుక దాక్కుని కళ్లుమూసుకుంది. హమ్మయ్య నన్నెవ్వరూ చూడట్లేదులే అనుకుని కిమ్మనకుండా..

పిల్లలు చేసే అల్లరి పనులు ఒక్కోసారి తెగ నవ్వుతెప్పిస్తాయి. ఈ విషయంలో జంతువులు కూడా ఎలాంటి మినహాయింపు లేదని ఓ పిల్ల ఏనుగు నిరూపించుకుంది. తాజాగా తల్లి ఏనుగు లేకుండా అర్ధరాత్రి ఓ పిల్ల ఏనుగు చెరకు తోటలో దొంగతనానికి వచ్చింది. ఆనక పస పస చెరకు తినసాగింది. ఇంతలో అలికిడికి తోట యజమాని వచ్చేశాడు. దీంతో భయపడిన ఈ ఏనుగు పిల్ల ఎటెళ్లాలో తెలియక రోడ్డు మీదకు వచ్చి.. ఓ కరెంట్ స్తంభం వెనుక దాక్కుని కళ్లుమూసుకుంది. హమ్మయ్య నన్నెవ్వరూ చూడట్లేదులే అనుకుని కిమ్మనకుండా నక్కింది. తీరా వాహనంలో రోడ్డు మీదకు వచ్చిన తోట యజమాని పిల్ల ఏనుగు అమాయకత్వానికి.. ముక్కుమీద కోపం కాస్త కరిగిపోయింది. అంతే పక్కున నవ్వేశాడు.
దొంగతనానికి వచ్చిన పిల్ల ఏనుగు నక్కేదేదో పొదల్లోనో, చెట్టుమాటునో ఉండాలి కదా..! పొలానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించే సరికి.. వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుని గట్టిగా కళ్లు మూసేసుకుంది. ఇక తానెవరికీ కనబడనని అనుకుంది. ఈ జంబో కిడ్ చేసిన విఫల ప్రయత్నానికి చేను యజమాని తనతో తెచ్చుకున్న ఫోన్లో క్లిక్ మనిపించాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేసి, పిల్ల ఏనుగు దొంగతనాన్ని వివరించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫొటో చూసినవారంతా పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు.
View this post on Instagram
‘కళ్లు మూసుకున్నాగా.. ఇక నేనెవ్వరికీ కనిపించను. నేను కూడా ఎవ్వరికీ కనిపించను’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టగా.. ‘హే.. అలా దాక్కోకూడదు. ఈ మనుషులు నీకు తప్పుగా నేర్పించారు’ అని మరో నెటిజన్, ‘జరిగిందేదో జరిగిపోయింది. కాస్త కామ్గా ఉండు జంబో కిడ్’ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్లు పెట్టారు. అన్నట్లు ఈ సంఘటన థాయ్లాండ్లో జరిగిందండోయ్. ఈ బుజ్జి ఏనుగు భారతీయ ఏనుగట. ఇది ఆసియా ఏనుగుల ఉపజాతికి చెందింది. వీటి చిన్న చెవులు ఆఫ్రికన్ జాతి ఏనుగుల నుంచి వేరు చేస్తాయి. 2025 నాటికి థాయిలాండ్లో 4,422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా. వాటిలో సగం ఐదు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నాయి. వీటి జనాభా పెరిగిపోవడంతో జనజీవనంలోకి ప్రవేశించి దాడులు చేస్తున్నాయి. గత ఏడాది 4,700 ఏనుగు దాడులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు. 594 వ్యవసాయ భూములు దెబ్బతిన్న కేసులు, 67 ఆస్తి నష్టం జరిగిన కేసులు, స్థానిక ప్రజలకు 22 మందికి గాయాలయ్యాయి. థాయిలాండ్లో అడవి జంతువలును హింసించినా, చంపినా కఠిన శిక్షలు విధిస్తుంది అక్కడి ప్రభుత్వం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.