Akhilesh Yadav: ఇవాళ మమతతో అఖిలేష్ యాదవ్ భేటీ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై వ్యూహాలు.. కాంగ్రెస్ లేకుండానే..

బీజేపీ ముక్త్‌ భారత్‌ కోసం ప్రాంతీయ పార్టీలు పట్టుదలతో ఉన్నాయి. కాంగ్రెస్‌ను పక్కన పెట్టి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. నేరుగా ఢిల్లీ కోటను ఢీ కొట్టేందుకు రెఢీ అంటున్నాయి. మరి జాతీయ స్థాయిలో ఈ ఫ్రంట్‌ను లీడ్‌ చేసేది ఎవరు? అసలిది ఎంత వరకూ సాధ్యమవుతుంది? ఇవాళ మమతా బెనర్జీతో అఖిలేష్ యాదవ్ మధ్య జరగనున్న ఈ భేటీ హాట్ హాట్‌గా మారుతోంది.

Akhilesh Yadav: ఇవాళ మమతతో అఖిలేష్ యాదవ్ భేటీ.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై వ్యూహాలు.. కాంగ్రెస్ లేకుండానే..
Akhilesh Yadav To Meet Cm Mamata Banerjee
Follow us

|

Updated on: Mar 17, 2023 | 8:33 AM

జాతీయ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి పార్టీలు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ ముఖ్య నేతలు పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నారు. శుక్రవారం అంటే ఈరోజు అఖిలేష్ యాదవ్ తన పార్టీ నేతలతో కలిసి బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత మమతా బెనర్జీని కలవనున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల దృష్ట్యా ఈ స‌మావేశం అత్యంత ప్రధానంగా జ‌రుగుతోంది. కోల్‌కతాలో జరిగే ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కూడా పాల్గొంటారు. ప్రతిపక్షాల ఐక్యతకు కూడా ఇది ముఖ్యమని భావిస్తున్నారు.

వాస్తవానికి, మమతా బెనర్జీ చాలా సందర్భాలలో ప్రతిపక్ష పార్టీలకు భిన్నంగా కనిపించారు. ఇటీవల కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన విపక్షాల సమావేశానికి కూడా మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు. ఆమె గైర్హాజరు కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. అలాగే, దీదీ ఈ చర్య థర్డ్ ఫ్రంట్ అవకాశాన్ని మరింత బలపరిచింది. ఇక్కడ, అఖిలేష్ యాదవ్ జనవరి నెలలో శరద్ పవార్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్‌లను కలిశారు.

ఇప్పుడు మమతా బెనర్జీ భేటీతో థర్డ్ ఫ్రంట్ కసరత్తు ముమ్మరంగా సాగుతున్నట్లు భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ లేకుండా.. అధికార భారతీయ జనతా పార్టీని ఓడించగలదా..? అనేది కూడా ప్రశ్న. కాంగ్రెస్, తృతీయ ఫ్రంట్ మధ్య ఒప్పందం కుదిరిందా లేదా రెండూ వేర్వేరు పేర్లతో ముందుకు వెళ్తాయి. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తేలిపోనున్నాయి. అయితే, డిసెంబర్‌లోనే నితీష్‌ కుమార్‌, హేమంత్‌ సోరెన్‌, తేజస్వీ యాదవ్‌, అఖిలేష్‌ యాదవ్‌లు టీఎంసీతో కలిసి బీజేపీని అధికారానికి దూరం చేస్తారని మమత చెప్పారు.

మమతా బెనర్జీతో జరగనున్న ఈ భేటీలో ప్రతిపక్ష పార్టీల నేతలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు తీసుకున్న చర్యల అంశం కూడా ప్రస్తావనకు రావచ్చు. ఈ సమావేశానికి ముందు బెంగాల్‌లో సమాజ్‌వాదీ పార్టీ రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది.