Inspirational Story: 7 పదుల వయసులో తాతగారి ట్యాలెంట్.. పదో తరగతి పరీక్షలు రాసి ఏకంగా 86% మార్కులతో ఉత్తీర్ణత!
కాలం పెట్టే పరీక్షల్లో చాలా మంది పరుగులు తీయడంలో అలసి పోతుంటారు. చరమాంకంలో అన్ని బాధ్యతలు, లోలోన దాచుకున్న చిన్న చిన్న కోరికలకు స్వస్తి పలికి వారసుల అచ్చటా ముచ్చటలో ఆనందం వెతుక్కుంటూ కాలం చాలించాలని భావిస్తారు. అయితే ఓ వ్యక్తి మాత్రం 70 ఏళ్ల వయసులో బడికి వెళ్లి అసాధారణ ప్రతిభ చాటాడు..

వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని.. చదువుకు వయసుకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాడు ఉత్తర ప్రదేశ్లోని రాయ్బరేలీకి చెందిన రాజారామ్ మౌర్య. 70 ఏళ్ల వయసులో రాజారామ్ పదో తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన ఏకంగా 86 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, యువతరానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. బ్యాంకింగ్ రంగం నుంచి ఆయన పదవీ విరమణ చేసినప్పటికీ నేర్చుకోవాలనే తపన మాత్రం ఆయనలో సజీవంగానే ఉంది.
రాయ్బరేలీలోని మధుబన్ ప్రాంతానికి చెందిన రాజారామ్ మౌర్య డిసెంబర్ 11, 1956లో జన్మించారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో 35 ఏళ్లపాటు సేవలు అందించిన ఆయన సీనియర్ మేనేజర్గా 2016లో పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత కూడా ఆయనలోని విద్యార్థి సజీవంగానే ఉన్నాడు. దీంతో పదో తరగతి బోర్డు పరీక్ష రాసి ఇండో – ఆర్యన్ భాష పాలీలో 86 శాతం మార్కులతో గరిష్ఠ ఉత్తీర్ణత సాధించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషను, హిమాచల్ ప్రదేశ్ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తిచేసిన రాజారామ్ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ టెన్త్ పరీక్ష రాయడం వెనుక ఓ బలమైన కారణం ఉందట. మౌర్యుల కాలం నాటి శాసనాలు పాలీ భాషలో ఉన్నాయి. వీటిని సొంతంగా చదివి చరిత్ర గురించి అధ్యయనం చేయాలని భావించిన రాజారామ్ ఈ వయసులో మళ్లీ విద్యార్థిగా మారాడట. ఈ విషయాలు ఆయనే స్వయంగా మీడియాకు వివరించారు. పదవీ విరమణ తీరిక సమయం దొరికినప్పుడు దానిని వృధా చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే హైస్కూల్ పరీక్ష రాసి తన చదువును పూర్తి చేయాలని భావించినట్లు ఆయన తెలిపారు.
1956 में पैदा हुए रिटायर्ड सीनियर बैक मैनेजर राजाराम मौर्या 70 साल की उम्र में हाईस्कूल पास हुए है..मार्क्स आये है 86%.
मौर्या जी पढ़ने-लिखने के शौकीन है. आज के जमाने की पढ़ाई पढ़ना चाहते थे इसलिए फिर से हाईस्कूल किया है. इस साल 11वीं और अगले साल इंटर के एग्जाम देगें.
उनकी इस… pic.twitter.com/qToEjlavoh
— Narendra Pratap (@hindipatrakar) April 23, 2026
కాగా నేటి కాలంలో చాలా మంది విద్యార్థులు పరీక్షలలో తక్కువ మార్కులు తెచ్చుకున్నా,ఫెయిల్ అయినా నిరుత్సాహానికి గురై మనోస్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఇటువంటి యువతకు రాజారామ్ మౌర్య గొప్ప ఆదర్శం. వైఫల్యానికి, వయస్సుకు సంబంధం లేదని ఆయన నిరూపించారు. మీకు నేర్చుకోవాలనే తపన, కష్టపడాలనే సంకల్పం ఉంటే జీవితంలో ఏ దశలోనైనా కొత్తగా ప్రారంభించవచ్చని రాజారామ్ సాధించిన ఈ విశిష్ట విజయం చెప్పకనే చెబుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




