AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..

మీ ఇంట్లో కూడా ప్రతిరోజూ భోజనం డైనింగ్ టేబుల్‌పైనే చేస్తున్నారా? అయితే ఈ విషయం మీ కోసమే.. పూర్వకాలంలో మన ఇంట్లో పెద్దలు నేలపై ప్లేట్ పెట్టుకుని ఎందుకు తినేవారో, దాని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మనం నేలపై కూర్చుని తింటున్నప్పుడు మన శరీరంలో రక్తప్రసరణ నుండి జీర్ణక్రియ వరకు ఎన్నో అద్భుతాలు జరుగుతాయి.

పెద్దల మాట బంగారు బాట.. నేలపై కూర్చుని తింటే శరీరంలో జరిగే అద్భుతం ఇదే..
Benefits Of Sitting On Floor While Eating
Krishna S
|

Updated on: Aug 09, 2026 | 10:00 PM

Share

భారతీయ సనాతన సంప్రదాయాల్లో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది. పూర్వకాలం నుండి మన ఇంట్లో పెద్దలు నేలపై కూర్చుని భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే నేటి ఆధునిక జీవనశైలి, పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో డైనింగ్ టేబుల్స్ వచ్చి చేరాయి. నిజానికి నేలపై కూర్చుని భోజనం చేయడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు.. అది శారీరక, మానసిక ఆరోగ్యానికి చేకూర్చే ఒక సహజమైన ఔషధం. నేలపై ప్లేట్ పెట్టుకుని తింటున్నప్పుడు, ఆహారాన్ని నోటి వరకు తెచ్చుకునేందుకు మనం ముందుకు, వెనుకకు వంగుతాము. ఈ ప్రక్రియ వల్ల ఉదర కండరాలకు ఒక రకమైన వ్యాయామం లభిస్తుంది. ఫలితంగా జీర్ణరసాలు సరిగ్గా స్రవించి, తిన్న ఆహారం త్వరగా, సులభంగా జీర్ణమవుతుంది.

గుండెకు, కడుపుకు సరైన రక్తప్రసరణ

మనం కుర్చీపై కూర్చున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా రక్తప్రసరణ ఎక్కువగా కాళ్ల వైపుకు వెళ్తుంది. అదే నేలపై కాళ్లు మడుచుకుని కూర్చున్నప్పుడు, కాళ్లకు వెళ్లే రక్త ప్రవాహం తగ్గి.. కడుపు, గుండె భాగాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు తగినంత రక్తం అందడం వల్ల అది తన పూర్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.

సులభంగా బరువు నియంత్రణ

నేలపై కూర్చుని తింటున్నప్పుడు నెమ్మదిగా, ఏకాగ్రతతో ఆహారాన్ని నమలి తినడం అలవాటవుతుంది. దీనివల్ల కడుపు నిండిన వెంటనే మెదడుకు స్పష్టమైన సంకేతాలు వెళ్తాయి. ఫలితంగా అతిగా తినడం తగ్గి, శరీర బరువు అదుపులో ఉంటుంది.

ఫ్లెక్సిబిలిటీ పెరిగి.. కీళ్ల నొప్పులకు చెక్

మోకాళ్లను, తుంటి భాగాన్ని వంచి నేలపై కూర్చోవడం వల్ల వెన్నెముక నిటారుగా ఉండి కండరాలు బలాన్ని పుంజుకుంటాయి. మోకాళ్లు, చీలమండల కీళ్లకు మంచి నమ్యత లభిస్తుంది. ఇది భవిష్యత్తులో ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది.

మానసిక ప్రశాంతత – ఒత్తిడి దూరం

మనం నేలపై కూర్చునే భంగిమ యోగాలోని సుఖాసనం లేదా పద్మాసనంను పోలి ఉంటుంది. ఈ ఆసనాలు మనస్సును ప్రశాంతపరిచి, ఆందోళనను, మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ప్రశాంతమైన మనస్సుతో తిన్న ఆహారం ఒంటికి బాగా పడుతుంది.

ఆధునికత పేరుతో మనం దూరం చేసుకుంటున్న చిన్న చిన్న ప్రాచీన అలవాట్లే మనల్ని నిత్య ఆరోగ్యవంతులుగా ఉంచుతాయి. కాబట్టి డైనింగ్ టేబుళ్లను పక్కనబెట్టి, రోజులో కనీసం ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేయడం అలవాటు చేసుకుందాం.

Follow Us