అవమానం ఎదురైనప్పుడు ఇలా చేయండి.. విదుర నీతి చెప్పిన విలువైన పాఠం
మన జీవితంలో ఎదురయ్యే అవమానాలు, ఎగతాళీలు మన మనోబలాన్ని పరీక్షిస్తాయి. అలాంటి సమయాల్లో విదుర నీతి మనకు ధైర్యాన్ని ఇచ్చే మార్గదర్శకంగా మారుతుంది. మహాభారతంలో విదురుడు చెప్పిన సూక్తులు మానవత్వం, ధర్మం, నిజాయితీ గురించి గొప్ప సందేశాలు అందిస్తాయి. వాటి బోధనతో మనం జీవితాన్ని గౌరవంగా జీవించవచ్చు.

ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే మన మనసు బాధపడిపోతుంది. అలాంటప్పుడు మనలో నమ్మకం తగ్గిపోతుంది. కానీ అప్పుడు మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమయం మారుతుంది. ఇప్పుడు మనల్ని ఎగతాళి చేసినవారు.. రేపు మన పరిస్థితిని అర్థం చేసుకునే రోజూ వస్తుంది.
ఇలాంటి సందర్భాల్లో విదుర నీతి మనకు మార్గం చూపుతుంది. ఇది మహాభారతం నుండి వచ్చిన ఒక గొప్ప పాఠం. మన బలహీనతల వల్ల ఎవరైనా మనల్ని తక్కువ చేసి మాట్లాడినా మనం దిగులుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరి సమయం ఒక్కొక్క రీతిగా తిరుగుతుంది. ఇది విదురుడు చెప్పిన ముఖ్యమైన సూక్తుల్లో ఒకటి.
విదురుడు మహాభారతంలో గొప్ప సన్యాసి లాంటి జీవితం గడిపాడు. అతని తెలివి, ధర్మానికి చేసిన నిబద్ధత వల్ల, అతను హస్తినాపురంలో ప్రధాన సలహాదారు అయ్యాడు. అతను దుర్యోధనుడికి ఏమాత్రం భయపడకుండా ధర్మం చెప్పేవాడు. సత్యం కోసం నిలబడే వ్యక్తిగా అతనికి పేరు వచ్చింది.
విదురుడు చెప్పినట్టు ఎవరితోనైనా హీనంగా మాట్లాడటం చాలా తప్పు. అలా చేసే వాళ్లను ప్రజలు ఓ మంచి మనిషిగా చూడరు. అలాంటి వాళ్లు సమాజంలో గౌరవం కోల్పోతారు. అసలు ఏ వ్యక్తినైనా మన బలంతో గెలవాలి కానీ అవమానపెట్టి కాదు. ఎవరైనా నిస్సహాయంగా ఉన్నపుడు వారిని ఎగతాళి చేస్తే అది మన మానవత్వాన్ని తక్కువ చేస్తుంది.
ఇతరులకు హాని చేసే వాళ్లు ఎప్పుడో ఒకసారి తాము చేసిన తప్పులకు తగిన శిక్ష అనుభవిస్తారు. అసూయతో, కోపంతో, దురాశతో ఎవరైనా ఇతరులకు కష్టం తెస్తే.. అది తిరిగి వారికే ఇబ్బందిగా మారుతుంది. ఆ సమయంలో వారిని చూసే ప్రతి ఒక్కరికి వారి నిజ స్వభావం అర్థమవుతుంది. ప్రజలు వారిని నమ్మరు. ఆ విశ్వాసం ఒక్కసారి పోతే తిరిగి పొందటం కష్టం.
మనం నిజాయితీగా, నిజం మాట్లాడితే చాలు. విదురుడు చెప్పినట్లు మంచి వాళ్లే చివరికి గెలుస్తారు. ఆ నమ్మకం మనకు ఉండాలి. ఎప్పుడూ మంచి పనులే చేస్తూ ముందుకు వెళ్లాలి. ఎవరైనా మనల్ని ఆటపట్టిస్తే మన మౌనం మన శక్తిగా మార్చుకోవాలి.