IRCTC Tourism: 30 పుణ్యక్షేత్రాలతో ఐఆర్సీటీసీ టూర్.. 17 రోజుల రామాయణ యాత్రకు సిద్ధమా?
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక స్థలాలు సందర్శించేందుకు ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తోంది. కుటుంబం, స్నేహితులతో కలిసి తక్కువ ధరలోనే అనేక ప్రదేశాలు చూసే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత "శ్రీ రామాయణ యాత్ర" పేరుతో పర్యాటకుల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పటికే నాలుగు సార్లు ఈ యాత్ర విజయవంతంగా నిర్వహించారు. తాజాగా ఐదో విడతలో భాగంగా 17 రోజుల పాటు శ్రీరాముడికి సంబంధించిన 30 పవిత్ర పుణ్యక్షేత్రాలు చూసే అవకాశం ఐఆర్సీటీసీ కల్పిస్తోంది. ఈ యాత్ర ఎప్పుడు, ఏ ప్రదేశాలు సందర్శిస్తారో వివరాలు ఇప్పుడు చూద్దాం. ఐఆర్సీటీసీ టూరిజం అందించే ఈ “శ్రీ రామాయణ యాత్ర” మొత్తం 16 రాత్రులు, 17 రోజులు సాగుతుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం అయోధ్యలో మొదలై సీతామర్హి, వారణాసి, ప్రయాగ్రాజ్, నాసిక్ మీదుగా రామేశ్వరంతో పూర్తవుతుంది. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రైన్ ద్వారా మొత్తం 150 మంది ప్రయాణికులకు ఈ అవకాశం ఉంది.
రైలు బయలుదేరే, దిగే స్టేషన్లు:
బయలుదేరే స్టేషన్లు: దిల్లీలోని సఫ్దార్గంజ్, గాజియాబాద్, అలీగఢ్, తుండ్లా జంక్షన్, ఇటావా కాన్పుర్, లఖ్నవూ.
దిగే స్టేషన్లు: ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మథుర, దిల్లీలోని సఫ్దార్గంజ్.
ప్రస్తుతం టికెట్ల బుకింగ్ కొనసాగుతోంది.
యాత్ర ప్రణాళిక
మొదటి రోజు (జులై 25): దిల్లీలోని సఫ్దార్గంజ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి నేరుగా యూపీలోని అయోధ్య రైల్వే స్టేషన్కు చేరుకుంటారు.
రెండో రోజు: అయోధ్య దర్శనం పూర్తయ్యాక హనుమాన్ గర్హి సహా స్థానిక ఆలయాలు చూసి రాత్రికి అక్కడే బస చేస్తారు.
మూడో రోజు: అయోధ్య నుంచి నందిగ్రామ్ వెళ్తారు. దర్శనం పూర్తయ్యాక సీతాదేవి జన్మస్థలం బిహార్లోని సీతామర్హి, నేపాల్లోని జనక్పుర్ సందర్శిస్తారు.
ఆ తర్వాత వారణాసికి వెళ్తారు. అక్కడ కాశీ విశ్వనాథ ఆలయం, తులసి మందిర్, హనుమాన్ మందిర్ చూస్తారు. గంగాహారతిని వీక్షిస్తారు. అక్కడి నుంచి రెండు రోజుల పాటు ప్రయాగ్రాజ్ తదితర ప్రాంతాలు సందర్శిస్తారు.
చిత్రకూట్ నుంచి నేరుగా మహారాష్ట్రలోని నాసిక్ చేరుకుంటారు. అక్కడ త్రయంబకేశ్వర ఆలయం, పంచవటిని దర్శించుకుంటారు.
అక్కడి నుంచి కర్ణాటకలోని హంపీకి వెళ్లి అంజనాద్రి హిల్స్, విరూపాక్ష, విఠల ఆలయాలను చూస్తారు.
చివరగా రామేశ్వరం చేరుకొని రామనాథస్వామి ఆలయం, ధనుష్కోడిని సందర్శిస్తారు.
మొత్తం 16 రోజులు యాత్ర పూర్తి చేసుకుని 17వ రోజు (ఆగస్టు 10) దిల్లీకి తిరిగి వస్తారు.
ప్యాకేజీ ఖర్చులు (ఒక్కొక్కరికి)
సుపీరియర్ (ఏసీ 1 టైర్)
కూప్: డబుల్ షేర్ రూ.1,79,515
క్యాబిన్: సింగిల్ షేర్ రూ.1,85,950, డబుల్ షేర్ రూ.1,66,380, ట్రిపుల్ షేర్ రూ.1,63,585
డీలక్స్ (ఏసీ 2 టైర్)
సింగిల్ షేర్ రూ.1,59,690, డబుల్ షేర్ రూ.1,40,120, ట్రిపుల్ షేర్ రూ.1,37,325
కంఫర్ట్ (ఏసీ 3 టైర్)
సింగిల్ షేరింగ్ రూ.1,37,545, డబుల్ రూ.1,17,975, ట్రిపుల్ షేరింగ్ రూ.1,15,180
5-11 ఏళ్ల పిల్లలకు:
ఏసీ టైర్ 1 క్యాబిన్: రూ.1,51,515
ఏసీ టైర్ 2: రూ.1,25,250
ఏసీ టైర్ 3: రూ.1,07,615
యాత్రలో చేర్చినవి
భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలులోని ఏసీ 1 కూప్, క్యాబిన్, 2 ఏసీ, 3 ఏసీ క్లాసుల్లో ప్రయాణించవచ్చు.
యాత్రలో 8 రాత్రులు రైలులో, మరో 8 రాత్రులు ఆయా ప్రాంతాల్లోని హోటళ్లలో బస ఉంటుంది.
ప్రయాణ సమయంలో రైల్లోని రెస్టారెంట్లలో అల్పాహారం, భోజనం అందిస్తారు. హోటల్లో 3 స్టార్ కేటగిరీ వసతి ఉంటుంది.
ఏసీ బస్సుల్లో సైట్ సీయింగ్ సదుపాయం, ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
ప్రస్తుతం ఈ టూర్ జులై 25న అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ చూడగలరు.




