AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు నేచర్ లవర్సా? వేసవిలో తోట పచ్చగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో మనుషులే కాకుండా మూగజీవాలు, పచ్చని మొక్కలు సైతం విలవిలలాడుతున్నాయి. వేసవి తాపానికి తట్టుకోలేక చాలామంది ఇళ్లలోని మొక్కలు ఎండిపోతుంటాయి. ఈ సమయంలో మొక్కల సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఎంతో అవసరం. కేవలం నీళ్లు పోయడమే కాకుండా అవి పోసే సమయం, విధానం కూడా మొక్కల ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి.

మీరు నేచర్ లవర్సా? వేసవిలో తోట పచ్చగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి
Summer Plants Care Tips1.jpg
Nikhil
|

Updated on: Apr 30, 2026 | 5:55 PM

Share

చాలామంది మొక్కలు వాడిపోయినట్లు కనిపించగానే వెంటనే నీళ్లు పోస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మండుతున్న ఎండల్లో మొక్కలకు నీరు అందించేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. సరైన సమయంలో నీరు పోయడం వల్ల నేల తేమను పీల్చుకుని వేర్లకు బలాన్ని ఇస్తుంది. లేదంటే ఆ నీరు ఆవిరి అయిపోయి మొక్కలకు ఏమాత్రం ఉపయోగపడదు.

నీరు పోయడానికి సరైన సమయం

వేసవి కాలంలో మొక్కలకు నీరు పోయడానికి ఉదయం వేళలు అత్యంత ఉత్తమం. ముఖ్యంగా ఉదయం ఎనిమిది గంటల లోపు నీరు పోయడం వల్ల నేల చల్లగా ఉంటుంది. దీనివల్ల నీరు నేల లోపలి పొరల వరకు వెళ్లి వేర్లకు అందుతుంది. పగలు ఎండ పెరిగే కొద్దీ ఆకులపై ఉన్న తేమ సహజంగా ఆరిపోతుంది. దీనివల్ల మొక్కలకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం తగ్గుతుంది. సాయంత్రం వేళల్లో కూడా నీరు పోయవచ్చు. కానీ సూర్యాస్తమయం తర్వాత నేల చల్లబడినప్పుడు మాత్రమే ఈ పని చేయాలి.

రాత్రిపూట ఆకులపై నీరు ఉండకుండా జాగ్రత్త పడాలి. గాలి సరిగ్గా ఆడని చోట ఆకులపై తేమ ఉండిపోతే మొక్కలకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం వేళల్లో మాత్రం పొరపాటున కూడా నీరు పోయకూడదు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల నీరు వేగంగా ఆవిరి అవుతుంది. ఆకులపై పడ్డ నీటి చుక్కలు లెన్స్ లా పనిచేసి సూర్యరశ్మిని కేంద్రీకరిస్తాయి. దీనివల్ల ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది.

సంరక్షణలో మెళకువలు

మొక్కలకు నీరు పోసేటప్పుడు నేరుగా వేర్ల దగ్గర పోయడం మంచిది. దీనివల్ల తేమ నేరుగా భూమిలోకి వెళ్తుంది. నీరు పోసే ముందు మట్టిని ఒకసారి పరీక్షించాలి. పై రెండు అంగుళాల వరకు మట్టి పొడిగా ఉంటేనే నీరు అందించాలి. అనవసరంగా ఎక్కువ నీరు పోయడం వల్ల వేర్లు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఎండల తీవ్రత నుంచి మొక్కలను కాపాడటానికి మల్చింగ్ పద్ధతి ఎంతో ఉపయోగపడుతుంది.

ఎండిన ఆకులు లేదా కొబ్బరి పీచును మట్టిపై కప్పడం వల్ల తేమ ఎక్కువ సేపు ఉంటుంది. ఇది నీరు ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. తరచుగా నీరు పోయాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల భానుడి భగభగలకు మీ మొక్కలు ఎండిపోకుండా పచ్చగా కళకళలాడుతాయి. సరైన సమయంలో తగినంత నీరు అందిస్తూ మీ తోటను కాపాడుకోవచ్చు. సంతులనం పాటించడం వల్ల మొక్కలు వేసవిలో కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి.

Follow Us