AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే ఇలా చేయాల్సిందే!

కిడ్నీలో ఉన్న రాళ్లు తొలగిపోవాలన్నా.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. ఎక్కవ నీరు తాగాలని చాలా మంది చెబుతుంటారు. అయితే, 2026లో ది లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ఒక కొత్త పరిశోధన ఈ పాత నమ్మకాన్ని సవాలు చేస్తోంది. కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే కిడ్నీలోని రాళ్లు వెళ్లిపోవని ఈ అధ్యయనం చెబుతోంది. మరీ ఈ సమస్యకు ఈ అధ్యయనం కనుగొన్న పరిష్కారం ఏమిటో చూద్దాం.

Health Tips: కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే ఇలా చేయాల్సిందే!
Kidney Stone Prevention
Anand T
|

Updated on: May 03, 2026 | 11:43 AM

Share

కిడ్నీలోని రాళ్లు పోవాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలనే మన పూర్వికుల నుంచి మనం వింటూనే ఉన్నాం. కానీ ఈ కొత్త పరిశోధనలో, వ్యక్తులు తమ నీటి వినియోగాన్ని గణనీయంగా పెంచినప్పటికీ, అది మూత్రపిండాల్లో రాళ్లు మళ్లీ ఏర్పడటాన్ని తగ్గించలేదని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ, సాంప్రదాయ ఆలోచనలను సవాలు చేస్తూ, ఒకప్పుడు అనుకున్నట్లుగా కేవలం హైడ్రేషన్ మాత్రమే సర్వరోగ నివారిణి కాకపోవచ్చని చెబుతోంది.

కొత్త పరిశోధన ఏం చెబుతోంది?

ది లాన్సెట్ పత్రికలో ప్రచురితమైన ప్రయోగంలో, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న సుమారు 1,600 మందిపై నిర్వహించిన ఈ భారీ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. వీరికి ఎక్కువ నీటిని ఇచ్చినప్పటికీ వారి కిడ్నీలో రాళ్లు తిరిగి వచ్చే రేటులో పెద్దగా మార్పు కనిపించలేదు. దీనికి ప్రదాన కారణం చాలామంది నీళ్లు తాగినప్పటికీ, రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి అవసరమైన స్థాయిలో మూత్ర విసర్జన జరగడం లేదని తేలింది. కేవలం నీళ్లు తాగడం అనే సూత్రం అందరికీ ఒకేలా పనిచేయదని ఈ పరిశోదన కనిపెట్టింది.

కేవలం నీరు సరిపోకపోతే.. ఇంకా ఏం చేయాలి?

కేవలం ఎక్కువ నీరు తాగడం వల్ల మాత్రమే మనం కిడ్నీలోని రాళ్లను తొలగించలేమని ఇందుకోసం మన రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మీరు తినే ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా ఉంటే మూత్రంలో కాల్షియం పెరిగి రాళ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అంటే పాలకూర, చాక్లెట్ వంటివి పరిమితం తీసుకోవాలని సూచిస్తున్నారు.

అలాగే కాల్షియం అధికంగా ఉండే ఆహారం, నిమ్మరసం వంటి సిట్రస్ పండ్లు రాళ్లు ఏర్పడకుండా సహాయపడతాయని అలాంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం ఉన్నవారిలో కిడ్నీ రాళ్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

అసలు ఎంత నీరు తాగాలి?

నిపుణులు ఇప్పుడు ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాము అనే దానికంటే, ఎంత మూత్రం విసర్జించాము అనే దానిపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఒక వేళ మీరు రోజుకు 3-4 లీటర్ల నీరు తాగుతుంటే రోజుకు కనీసం 2 నుండి 2.5 లీటర్ల మూత్ర విసర్జన జరిగేలా చూసుకోవాలంటున్నారు. నీరు తాగడం ఖచ్చితంగా అవసరమే, కానీ అది కిడ్నీ రాళ్లకు ఏకైక పరిష్కారం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, తగినంత మూత్ర విసర్జన జరిగేలా చూసుకోవడం ద్వారానే ఈ సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మాత్రమే అందించబడింది. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే.. ఇవి ఫాలో అయ్యే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us