ICMR Study: పదిలో తొమ్మిది మందిని వెంటాడుతున్న డేంజర్ వ్యాధి.. ఐసీఎంఆర్ సర్వేలో షాకింగ్ నిజాలు!
దేశంలో రోజురోజుకూ గుండె బబ్బులు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 50 ఏళ్లు దాటిన ప్రతి 10 మందిలో 9 మంది అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని.. ఐసీఎంఆర్-ఇండియాబ్ జరిగిన తాజా అధ్యయనంలో స్పష్టమైంది. వివిధ రాష్ట్రాలకు చెందిన 23,665 మందిపై జరిపిన ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. అవేంటో చూద్దాం పదండి.

గుండె సమస్యలకు రావడానికి అధిక కొలెస్ట్రాల్ అనే ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 90 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్ల సమతుల్యత దెబ్బతినడాన్ని వైద్య పరిభాషలో డిస్లిపిడెమియా (Dyslipidemia) అంటారని.. దీని ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం కారణంగా చాలా మంది దీనిని గుర్తించలేకపోతున్నారని పరిశోధకులు తెలిపారు.
అయితే ఈ అధిక కొలెస్ట్రాల్ అనేది వెంటనే మనపై ఎఫెక్ట్ చూపించకపోయినా..ఇవి రక్తనాళాల లోపలి పొరలలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. కాలక్రమేణా ఈ కొవ్వు రక్త ప్రసరణకు ఆటంకం కలిగించి.. రక్తనాళాలు పగిలిపోయేలా చేస్తుంది. దీనివల్ల గుండెపోటు , బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాకర వ్యాధులు వచ్చే ప్రమాదం విపరీతంగా పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అయితే దీనిని ముందే గుర్తించే మార్గం లేదా అంటే ఉంది.. లిపిడ్ ప్రొఫైల్ పరీక్షల ద్వారా దీనిని మనం ముందే గుర్తించి, మంచి ఆహార అలవాట్లు, క్రమం తప్పని వ్యాయామం, అవసరమైతే మందుల వాడకం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
తక్కువగా ఉన్న మంచి కొలెస్ట్రాల్
ఈ అధ్యయనంలో పాల్గొన్న చాలా మందిలో కనిపించిన సాధారణ సమస్య ఏమిటంటే..’హెచ్డీఎల్’ (HDL) లేదా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉండటం. సర్వేలో పాల్గొన్న సుమారు 66.8శాతం మందిలో మంచి కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉంది. మిగతా అందరిలో చెడు కొలెస్ట్రాల్ (LDL) ఎక్కువగా ఉంది.
మహిళలు, పట్టణవాసులకే ఎక్కువ ముప్పు
అయితే మగవారితో పోల్చుకుంటే మహిళల్లో, గ్రామీణ ప్రాంతాలతో నివసించే వారితో పోలిస్తే పట్టణ ప్రాంతాల ఉండే వారిలోనే ఈ అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కవగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. డయాబెటిస్, ప్రీ-డయాబెటిస్, ఊబకాయం , అధిక రక్తపోటు ఇతర వ్యాధులతో బాధపడేవారిలో కొలెస్ట్రాల్ సమస్యలు మరింత ఎక్కువగా ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది.
ముందస్తు పరీక్షలే రక్ష
దేశవ్యాప్తంగా నివసిస్తున్న జనాల్లో 30 ఏళ్ల వయసు నుంచే ఈ అధిక కొలెస్ట్రాల్ సమస్యలు మొదలవుతున్నాయని సర్వేలో తేలింది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని, ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, ఊబకాయం ఉన్నవారు ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే గుండె జబ్బులను నివారించవచ్చని పరిశోదకులు సూచిస్తున్నారు.
డిస్లిపిడెమియా అంటే ఏమిటి?
రక్తంలో కొవ్వుల అసమతుల్యత: రక్తంలో కొలెస్ట్రాల్ లేదా ట్రైగ్లిజరైడ్ స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం.
లక్షణాలు లేని జబ్బు: దీనికి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేదా లక్షణాలు ఉండవు. రక్త పరీక్షల ద్వారా మాత్రమే దీనిని గుర్తించగలరు.
గుండె జబ్బులకు కారణం: అధిక ఎల్డీఎల్ రక్తనాళాలను ఇరుకుగా మార్చి గుండెపోటు, పక్షవాతం వచ్చేలా చేస్తుంది.
జీవనశైలి, జన్యువులు: సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, మద్యపానం మరియు వంశపారంపర్య కారణాల వల్ల ఇది వస్తుంది.
నివారణ మార్గాలు: ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, ధూమపానం-మద్యపానానికి దూరంగా ఉండటం, వైద్యుల సలహా మేరకు మందులు వాడటం ద్వారా దీనిని ఈ సమస్య నుంచి తగ్గించుకోవచ్చు.
మరిన్ని లైఫ్స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
