ట్రెడిషనల్ స్టైల్లో పులిహోర రెసిపీ.. అమ్మమ్మ చేతి రుచిని ఇప్పుడు మీరూ చూడండి..!
వినాయకుడికి మనం చేసే ప్రసాదాలలో పులిహోర ఒక్కటి.. తప్పనిసరిగా చేసే ప్రసాదం ఇది. చింతపండు రుచితో పాటు సులభంగా తయారయ్యే ఈ వంటకం ఆలయాల్లో ఇచ్చే ప్రసాదంలా ఉంటుంది. అన్నం, చింతపండు పేస్ట్, పల్లీలు, ప్రత్యేకమైన పోపు దినుసులతో తయారయ్యే ఈ పులిహోర రుచికరమైనదే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది.

వినాయకుడికి నైవేద్యంగా పెట్టడానికి అనువైన, ఇంట్లో సులభంగా తయారు చేసుకునే పులిహోరను ఈ రెసిపీలో చెప్పిన విధంగా తయారు చేసి భక్తితో వినాయకుడికి సమర్పించండి. ఈ రుచికరమైన పులిహోరను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, సులభమైన విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
- బియ్యం – ¾ కప్పు
- నీరు – 1 ½ కప్పులు
- చింతపండు – 20 గ్రా (పులుపు ఎక్కువ కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు)
- శెనగపప్పు – 2 టీస్పూన్లు
- మినప పప్పు – 1 టీస్పూన్
- మెంతులు – ⅛ టీస్పూన్
- ఆవాలు – 1 టీస్పూన్
- పచ్చి మిరపకాయలు – 3
- ఎండు మిరపకాయలు – 3
- పసుపు పొడి – ¼ టీస్పూన్
- కరివేపాకు – కొద్దిగా
- ఇంగువ – ⅛ టీస్పూన్
- పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు – రుచికి సరిపడా
- నూనె – 3 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
పులిహోర తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి సరిపడినంత నీరు కలిపి ప్రెషర్ కుక్కర్లో ఉడికించాలి. మొదటి విజిల్ వచ్చాక మంట తగ్గించి పది నిమిషాలు ఉడికించాలి. అన్నం చల్లారిన తర్వాత అది ముద్దగా అవ్వకుండా ఫోర్క్తో మెల్లగా కలపాలి.
చింతపండు పేస్ట్ తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి అందులో చింతపండు వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మైక్రోవేవ్లో ఒకటిన్నర నిమిషం పాటు వేడి చేయండి. తర్వాత పవర్ తగ్గించి మరో రెండు నిమిషాలు ఉడికించండి. మిశ్రమం చల్లారిన తర్వాత దానిని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్లో వేయడానికి మధ్యలోకి చీల్చిన పచ్చి మిరపకాయలు, అలాగే ఎండు మిరపకాయలు కూడా సిద్ధం చేసుకోండి.
పులిహోర కలపడానికి చల్లారిన అన్నంలో చింతపండు పేస్ట్, ఉప్పు వేసి ఫోర్క్తో కలపాలి. ఒక కడాయిలో నూనె వేడి చేసి పల్లీలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో మెంతులు, శెనగపప్పు, మినప పప్పు, ఆవాలు వేసి వేగాక, ఇంగువ, పచ్చి మిరపకాయలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ తర్వాత పసుపు పొడి వేసి కలిపి ఈ పోపును అన్నంలో వేసి కలపాలి. చివరిగా వేయించిన పల్లీలు వేసి కలపాలి.
ఈ పులిహోరను వెంటనే కాకుండా మూడు నుంచి నాలుగు గంటల తర్వాత తింటే రుచి ఇంకా బాగుంటుంది. పాత చింతపండు కాకుండా కొత్త చింతపండు వాడితే రంగు, రుచి బాగుంటాయి. అలాగే పల్లీలు చిటపటలాడే వరకు వేయించడం వల్ల అవి కరకరలాడతాయి. పసుపు పొడిని స్టవ్ ఆఫ్ చేశాక వేయడం వల్ల రంగు బాగా పడుతుంది.




