ఉదయం పూట ఏ పండ్లు తినాలి.. ఏవి తినకూడదు..? ఇవి తప్పక తెలుసుకోండి..
ఉదయాన్నే పండ్లు తింటే ఆరోగ్యమని మనందరికీ తెలుసు.. కానీ ఏ పండు తింటున్నామన్నదే ముఖ్యం.. మీరు ఆరోగ్యంగా ఉండాలని తినే పండే మీ కడుపులో మంటకు, గ్యాస్ సమస్యలకు కారణం కావొచ్చు. పరగడుపున ఆపిల్ తింటే అమృతం.. అదే నారింజ తింటే ఆమ్లం.. అసలు ఉదయం పూట ఏ పండ్లు మీకు మేలు చేస్తాయి? వేటిని దూరం పెట్టాలి? అనేది తెలుసుకుందాం..

ఉదయం నిద్రలేవగానే ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు అని పెద్దలు చెబుతుంటారు. ఇది నిజమే కానీ, అన్ని పండ్లు ఖాళీ కడుపుతో తింటే మేలు చేస్తాయని అనుకోవడం పొరపాటే. ఏ సమయంలో ఏ పండు తినాలి? ఉదయాన్నే శరీరానికి శక్తినిచ్చే పండ్లు ఏవి? ఖాళీ కడుపుతో తింటే అనారోగ్యం కలిగించే పండ్లు ఏవి? అనేదానిపై ఆరోగ్య నిపుణులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఉదయం అల్పాహారంలో ఇవి మీకు అమృతం
పరగడుపున పండ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన తేమ, శక్తి అందుతాయి.
ఆపిల్ : ఇందులో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మలవిసర్జన సాఫీగా అయ్యేలా చూస్తుంది.
బొప్పాయి: జీర్ణక్రియకు బొప్పాయిని మించిన పండు లేదు. ఇందులోని పాపైన్ ఎంజైమ్లు మలబద్ధకం సమస్యను తరిమికొడతాయి.
పుచ్చకాయ : వేసవిలో పరగడుపున పుచ్చకాయ తింటే శరీరంలోని ఎలక్ట్రోలైట్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇందులోని లైకోపీన్ చర్మానికి, కళ్ళకు మెరుపును ఇస్తుంది.
దానిమ్మ : రక్తహీనతతో బాధపడేవారికి ఇది వరం. ఇందులోని ఇనుము రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
ఖాళీ కడుపుతో వీటిని తింటే ప్రమాదం
కొన్ని పండ్లు ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో తింటే సమస్యలు తెచ్చిపెడతాయి.
సిట్రస్ పండ్లు: నారింజ, గ్రేప్ఫ్రూట్ వంటి పుల్లటి పండ్లలో ఆమ్లాలు ఎక్కువ. వీటిని ఉదయాన్నే తింటే కడుపులో మంట, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.
అరటిపండు: అరటిపండులో పొటాషియం ఎక్కువ. ఖాళీ కడుపుతో దీన్ని తింటే రక్తంలో మెగ్నీషియం, పొటాషియం సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే దీన్ని ఓట్స్ లేదా వేరే ఆహారంతో కలిపి తీసుకోవాలి.
ద్రాక్ష: చాలా తీపిగా ఉండే ద్రాక్షపండ్లను ఉదయాన్నే తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత వెంటనే పడిపోతాయి. దీనివల్ల మీరు త్వరగా అలసిపోతారు.
బేరి పండ్లు: వీటిలోని గట్టి పీచు పదార్థాలు ఖాళీ కడుపులోని సున్నితమైన పొరను చికాకు పెడతాయి.
పండ్లు తినేటప్పుడు ఈ సూత్రాలు పాటించండి..
నీరు తాగకండి: పండ్లు తిన్న 30 నిమిషాల ముందు లేదా తర్వాత నీళ్లు తాగవద్దు. అలా చేస్తేనే పోషకాలు శరీరానికి అందుతాయి.
ఉడికించవద్దు: పండ్లను ఉడికించడం వల్ల వాటిలోని విటమిన్-సి నశిస్తుంది.
బాగా నమలండి: పండ్లను బాగా నమలడం వల్ల లాలాజలం కలిసి జీర్ణక్రియ సులభమవుతుంది.
జ్యూస్ కంటే పండు మిన్న: ప్యాకెట్లలో దొరికే జ్యూస్ల కంటే తాజా పండ్లను అలాగే తినడం వల్ల శరీరానికి అవసరమైన ఫైబర్ అందుతుంది.
