Family Life: కాపురాల్లో చిచ్చు పెడుతున్న స్మార్ట్ ఫోన్! అందుకే అంటారు అతి అనర్థమని!
స్మార్ట్ ఫోన్ కుటుంబాల్లో చిచ్చు పెడుతోందట! భార్యభర్తల మధ్య అంతరాన్ని పెంచుతోందట! ఇది ఎవరో చెప్పింది కాదు.. స్వయాన ఆ బాధ అనుభవిస్తున్న పలువురు దంపతులే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అతి అనేది అన్ని విధాలా అనర్థమే! ఏదైనా అవసరం మేరకు.. పరిధి మేరకు వినియోగిస్తే దాని వల్ల మంచి జరుగుతుంది. అయితే అదే జీవితం అన్నట్లు.. అదే సర్వస్వం అన్నట్లు చేస్తేనే విపరీతాలు చోటుచేసుకుంటాయి. అది సమాజాన్ని పెడదోవ పట్టించడంతోపాటు కుటుంబ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. ఇందుకీ హితబోధ అంటే.. మన అరచేతిలో ఇమిడిపోయిన స్మార్ట్ ఫోన్.. ప్రపంచాన్ని గుప్పిట్లోకి తెచ్చి పెట్టింది. ఎక్కడ ఏ మూల, ఏది జరిగినా ఇట్టే తెలిసేలా చేస్తోంది. మనిషికీ మనిషికీ మధ్య దూరం చెరిపేసింది. అందరినీ తనతో కనెక్ట్ చేసేసింది. మారుతున్న కాలానుగుణంగా, అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతికతతోనే ఇది సాధ్యమైంది. అయితే అదే స్మార్ట్ ఫోన్ కుటుంబాల్లో చిచ్చు పెడుతోందట! భార్యభర్తల మధ్య అంతరాన్ని పెంచుతోందట! ఇది ఎవరో చెప్పింది కాదు.. స్వయాన ఆ బాధ అనుభవిస్తున్న పలువురు దంపతులే ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
88 శాతం దంపతుల అభిప్రాయం ఇదే..
వివో స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ సైబర్ మీడియా రీసెర్చ్(సీఎంఆర్) సహకారంతో మానవ సంబంధాలపై స్మార్ట్ఫోన్లు ప్రభావంపై ‘స్విచ్ ఆఫ్’ పేరిట ఓ అధ్యయనం చేసింది. అది ప్రకటించిన ఫలితాలలో విస్తుపోయే వాస్తవాలు ఉన్నాయి. దాదాపు 88శాతం మంది దంపతులు కేవలం స్మార్ట్ ఫోన్ అతిగా వినియోగించడం వల్ల తమ మధ్య గ్యాప్ పెరుగుతోందని ఒప్పుకున్నట్లు పేర్కొంది. వీరిలో 67% మంది తమ జీవిత భాగస్వామి పక్కనే ఉన్నప్పుడు కూడా ఫోన్లను వదలడం లేదని వివరించింది.
దృక్పథం మారుతోంది..
స్మార్ట్ఫోన్ అధిక వినియోగంతో దంపతుల ప్రాధాన్యాలు మారిపోతున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. స్మార్ట్ఫోన్లో నిమగ్నమై ఉన్నప్పుడు వారి జీవిత భాగస్వామి వారిస్తే చిరాకు పడతారని, ఇది దాదాపు 70 శాతం మందిలో జరుగుతోందని చెప్పింది. మరో 69% మంది తమ జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు తగినంత శ్రద్ధ వహించడం లేదని వారే ఒప్పుకున్నట్లు వివరించింది. మరో 89 శాతం మంది కనీసం తమ సాటియైన సహాయంతో మనసువిప్పి మాటలాడ లేకపోతున్నట్లు పేర్కొంది.
మారడానికి సిద్ధమే..
ఈ అధ్యయనంలో ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. ఏదైతే సమస్య దంపతులను ఇబ్బంది పెడుతోందో.. దానిని విడిచిపెట్టేందుకు.. తమ సంసారాన్ని మళ్లీ గాడిన పెట్టుకునేందుకు వారంతా అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. దాదాపు 84 శాతం మంది తమ జీవిత భాగస్వామితో ఎక్కువ మాట్లాడటానికి, వారితో కలిసి ఉండటానికి, 88 శాతం మంది స్మార్ట్ ఫోన్ను దూరం పెట్టడానికి, 90% మంది విశ్రాంతి సమయాన్ని జీవిత భాగస్వామితోనే గడపడానికి మొగ్గుచూపుతున్నట్లు స్పష్టం చేసింది.
జీవితాన్ని ఇంతలా ప్రభావితం చేస్తున్నాయా?
స్మార్ట్ ఫోన్ ప్రజల జీవితాలను ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయో అనే దానిపై కూడా ఆ సంస్థ అధ్యయనం చేసింది. దానిలో దాదాపు 84 శాతం స్మార్ట్ ఫోన్ కూడా తమ శరీరంలో ఒక భాగమని చెప్పారంట. 72 శాతం మంది స్మార్ట్ ఫోన్లో మునిగిపోయి చుట్టూ ఎం జరుగుతుందో కూడా గమనించుకోలేక పోతున్నారట. ఇంకా 58% మంది ప్రజలు భోజనం చేసేటప్పుడు స్మార్ట్ఫోన్లను ఉపయోగిస్తున్నారని అంగీకరించారు. 86% మంది తమన బెడ్పైకి వచ్చే ముందు చివరిగా చూసేది ఫోన్ అని, 60% మంది కుటుంబంతో కూర్చున్నప్పుడు కూడా స్మార్ట్ఫోన్లను వదలడం లేదని తేలింది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..






