Kadapa: త్రేతాయుగంలో జాంబవంతుడు నిర్మించిన రామాలయం.. కానీ హనుమంతుడి విగ్రహం ఉండదు..
ఏ రామాలయం చూసినా సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో పాటు హనుమంతుడి విగ్రహం తప్పనిసరిగా ఉంటుంది.. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రామాలయంలో ఏకశిలపై చెక్కబడిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ఉంటాయి కానీ హనుమంతుల వారి విగ్రహం మాత్రం ఉండదు.. ఏకశిలా నగరంగా పిలవబడే ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయంలో హనుమంతుడి విగ్రహం లేకపోవడానికి కారణం ఏమిటి అనుకుంటున్నారా..?

ఉమ్మడి కడప జిల్లా ప్రస్తుత అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట మండలంలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా ఇక్కడ సీతారాముల వారి కళ్యాణాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ రామాలయానికి ఓ చరిత్ర ఉంది ఇక్కడ ప్రతి రామాలయంలో కనిపించిన విధంగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలతో పాటు హనుమంతుని విగ్రహం ఇక్కడ కనిపించదు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. రాములవారు, సీతాదేవి, లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఒంటిమిట్ట ప్రాంతంలో సంచరించినట్లు పురాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో శ్రీరాముల వారు సంచరిస్తున్న సమయానికి ఇంకా హనుమంతుల వారు రాములవారికి పరిచయం లేదట. అందుకే ఇక్కడ కట్టిన దేవాలయంలో హనుమంతుల వారి విగ్రహం ఉండదు. అంతేకాకుండా ఇక్కడ దేవాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఏకశిలపై చెక్కబడి ఉంటాయి. అందుకే దీనిని ఏకశిలా నగరం అని కూడా అంటారు.. అంతేకాకుండా అరణ్యపర్వంలో కాకుండా హనుమంతుల వారు కిష్కిందకాండ సమయంలో రాములవారికి తారసపడి అప్పుడు నుంచి భక్తుడిగా మారినట్లు పురాణాలు ఉన్నాయి .. అందుకే ఈ దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదని స్దల పురాణాలు ఉన్నాయి.. త్రేతాయుగంలో జాంబవంతుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు.
ఇక ఒంటిమిట్టకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే.. ఒంటోడు. మిట్టోడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ ఉన్నప్పుడు వారికి శ్రీరాముల వారు కలలో కనిపించడంతో వారికి జ్ఞానోదయం అయ్యి దొంగతనాలు మానేసి మంచి మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారని చెబుతుంటారు. అంతేకాకుండా జాంబవంతుడు నిర్మించిన ఈ ఆలయాన్ని వారు అభివృద్ధి చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు కాబట్టి ఈ నగరాన్ని ఒంటిమిట్ట నగరంగా పిలుస్తారు అనేది స్థానికులు చెబుతున్న మాట. అలాగే ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి ఏటా జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరామనవమి సమయంలో ఇక్కడ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. భద్రాచలంలో లాగా నవమి రోజు సీతారాముల కళ్యాణం కాకుండా నవమి తర్వాత వచ్చే పౌర్ణమికి నిండు పౌర్ణమిలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అంగారంగ వైభవంగా కనుల విందుగా జరిగే ఈ కళ్యాణాన్ని చూడడానికి వేల మంది భక్తులు వచ్చి తిలకిస్తారు. అంతేకాకుండా దీనిని ప్రభుత్వ పండుగగా కూడా జరుగతుంది. అందుకే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడకు వచ్చి సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
