Andhra Pradesh: పర్వతం అంచున భీముని రాయి.. గాలికి కదులుతున్నా పడిపోని అద్భుతం వెనుక కథ గురించి తెలుసా..?
అల్లూరి జిల్లాలోని హుకుంపేటలో ఉన్న భీముని రాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వత అంచున స్థిరంగా ఉన్న ఈ భారీ బండరాయి వెనుక భీముడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన పురాణం ఉంది. స్థానిక గిరిజనులు దీనిని అత్యంత నిష్టతో పూజిస్తారు. వారి సంస్కృతిలో ఇది ఒక భాగం.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ పరిధిలోని హుకుంపేట మండలం గొందూరులో ఉన్న ఒక పర్వతం అంచున ఉన్న భారీ బండరాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానిక గిరిజనులు దీనిని భీముని రాయి లేదా డూంకు రాయి అని పిలుస్తున్నారు. ఈ రాయి దగ్గరకు గిరిజనులు నిష్ఠతో వెళ్తారు. దీని వెనుక పెద్ద కథే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఈ రాయిని చూసేందుకు, దాని వెనుక ఉన్న కథను తెలుసుకునేందుకు పర్యాటకులు ఈ ప్రాంతానికి క్యూ కడుతున్నారు.
గ్రామస్తుల సమాచారం ప్రకారం.. భీముడి కాలంలో ఈ పర్వతంపై కొందరు నృత్యం చేస్తుండగా అటువైపుగా ఒక వరాహం వెళ్ళిందట. ఆ వరాహం ఆచూకీ తెలుసుకోవడానికి భీముడు ఈ భారీ బండరాయిని పర్వతం అంచున పెట్టి, దానిపైకి ఎక్కి చుట్టుపక్కల ప్రాంతాన్ని చూశాడని ప్రచారం. ఆ వరాహం జాడ సుమారు 5 కిలోమీటర్ల దూరంలో తెలిసిందని, ఆ ప్రాంతంలోనే ప్రస్తుతం పంది మెట్టు అనే గ్రామం వెలసిందని స్థానికులు చెబుతున్నారు. పూర్వీకులు నుంచి తమకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ రాయిని అత్యంత నిష్టతో తాము చూస్తామని.. ఆ రాయి దగ్గరకు చెప్పులు విడిచి వెళ్తామని స్థానికుడు మచ్చన్న అంటున్నారు.
ఈ రాయి పట్ల స్థానిక గిరిజనులకు అపారమైన విశ్వాసం ఉంది. ఈ రాయి పర్వతం అంచున స్థిరంగా ఉన్నప్పటికీ.. గాలి వేసినప్పుడు అది కదులుతున్నట్లు అనిపిస్తుందట. అయితే ఏళ్లుగా ఆ రాయితో ఎటువంటి ప్రమాదం జరగలేదని, దానిని దేవుడే ప్రతిష్టించారని చుట్టుపక్కల గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు. ఈ ప్రాంత ప్రజలంతా చందాలు వేసుకుని ఆ రాయి దగ్గర పండుగలు కూడా నిర్వహిస్తారు. తమ పూర్వీకులు ఇచ్చిన ఈ సమాచారాన్ని తాము భావితరాలకు అందిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ రాయి వెనుక ఉన్న అసలు కథ మరియు చరిత్ర ఏంటనేది పూర్తి వివరాలు చరిత్రకారుల పరిశోధన తర్వాతే బయటపడాల్సి ఉంది. ఏది ఏమైనా, ప్రస్తుతం ఈ ‘భీముడి రాయి’ అల్లూరి జిల్లా పర్యాటక రంగంలో సరికొత్త ఆకర్షణగా నిలుస్తోంది.
