కర్నాటక లో ఘోర రోడ్డు ప్రమాదం, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కి గాయాలు, భార్య, వ్యక్తిగత కార్యదర్శి మృతి, నుజ్జునుజ్జయిన వాహనం
కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ గాయపడగా, ఆయన భార్య, పర్సనల్ సెక్రెటరీ మరణించారు..
కర్నాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ గాయపడగా, ఆయన భార్య, పర్సనల్ సెక్రెటరీ మరణించారు. ఆయుష్, రక్షణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అయిన నాయక్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన గోవాలోని వైద్యకళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తర కర్ణాటక లోని అంకోలాలో శ్రీపాద నాయక్ ఎల్లాపూర్ నుంచి గోకర్ణకు వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న తెల్లని టయోటా కారు అతి వేగంగా చెట్లు, పొదల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో శ్రీపాద నాయక్ భార్య అక్కడికక్కడే మృతి చెందగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి దీపక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదంలో ఈ వాహనం నుజ్జునుజ్జయింది. ఈ యాక్సిడెంట్ పట్ల ప్రధాని మోదీ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శ్రీపాద నాయక్ చికిత్సకు అన్నిఏర్పాట్లు చేయాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్ ని ఆదేశించారు. అటు కర్నాటక సీఎం ఎడ్యూరప్ప, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ వాల్ ఈ ఘోర ప్రమాదం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.