నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు..

తెలంగాణలో నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నియంత్రిత సాగు విధానం లేదని ప్రకటించింది. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు..
Follow us

|

Updated on: Dec 27, 2020 | 6:34 PM

తెలంగాణలో నియంత్రిత సాగుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నియంత్రిత సాగు విధానం లేదని ప్రకటించింది. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కేసీఆర్‌ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై సుదీర్ఘంగా సమీక్షించారు. అనంతరం నియంత్రిత సాగుపై నిర్ణయాన్ని ప్రకటించారు. రైతులు పంటలు ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో…అక్కడే అమ్ముకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రైతు వేదికల్లో రైతులు, వ్యవసాయశాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలని ప్రభుత్వం సూచించింది. స్థానిక పరిస్థితులు, మార్కెట్ పరిస్థితులకు అనుగూణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో స్థానికంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అంతేకాదు, పండించిన పంటకు మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించాలని సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్‌ సూచించారు.

రాష్ట్రంలో రైతుబంధు పథకం అమలు తీరుపై కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చేనెల వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు పథకం కింద ఆర్థిక సహాయం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రైతుబంధు నగదు పంపిణీలో భాగంగా రాష్ట్రంలోని 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంట సాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.