గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్టీ-పీసీఆర్ ద్వారా కరోనా టెస్ట్..!
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమముల్ తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ), బస్తీ దవాఖానాల్లోనూ
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ), బస్తీ దవాఖానాల్లోనూ ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ఆర్టీ–పీసీఆర్ కిట్లను పంపించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం పెద్దాసుపత్రుల నుంచి పీహెచ్సీ స్థాయి వరకు 1,100 పరీక్షా కేంద్రాల్లో అన్ని చోట్లా ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టుతో అరగంటలోపే ఫలితం తెలుస్తోంది. అందులో కరోనా పాజిటివ్ వస్తే పూర్తిస్థాయి పాజిటివ్గానే గుర్తించవచ్చు. కానీ యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే దాని కచ్చితత్వం కేవలం 50 నుంచి 70 శాతమేనని ఐసీఎంఆర్ ప్రకటించిన సంగతి విదితమే. అయితే నెగెటివ్ వచ్చి, లక్షణాలు ఏమాత్రం లేకపోతేనే దాన్ని నెగెటివ్గా గుర్తించాలని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ఒకవేళ నెగెటివ్ వచ్చి కరోనా లక్షణాలుంటే తప్పనిసరిగా ఆర్టీ–పీసీఆర్ పద్ధతిలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఐసీఎంఆర్ తేల్చిచెప్పింది.
కాగా.. పీహెచ్సీ స్థాయిలో యాంటీజెన్ టెస్టులు చేయించుకొని నెగెటివ్ వచ్చి లక్షణాలున్న వారు సాధారణంగా తిరుగుతున్నారన్న భావన ఉంది. దీంతో అటువంటి వారికి ఇక నుంచి తక్షణమే ఆర్టీ–పీసీఆర్ పరీక్ష చేస్తారు. ఆర్టీ–పీసీఆర్ కోసం తీసుకున్న శాంపిళ్లను ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేబొరేటరీలకు పంపిస్తారు. వాటి ఫలితాలు 24 గంటల నుంచి రెండు, మూడ్రోజుల్లో వస్తాయి.