ఫ్యాన్స్కు గుడ్న్యూస్.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో వైభవ్కు చోటు.. ఓపెనర్లుగా ఎవరంటే?
India ODI World Cup 2027 Squad: వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం దూకుడుమీదున్నాడు. వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈ క్రమంలో వన్డే ప్రపంచకప్ 2027 జట్టులో చోటివ్వాలంటూ ఇప్పటికే ప్రతిపాదనలు మొదలయ్యాయి. దీంతో టీమిండియా మాజీ ప్లేయర్ వన్డే ప్రపంచకప్ 2027 జట్టును ఎంచుకుని షాకిచ్చాడు.

India ODI World Cup 2027 Squad: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2027 ఐసీసీ వన్డే వరల్డ్ కప్ సన్నాహాలపై ఇప్పటినుంచే క్రీడావర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. భారత మాజీ ఓపెనర్ రాబిన్ ఉతప్ప తాజాగా తన 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఇందులో 15 ఏళ్ల సంచలన బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
రాబిన్ ఉతప్ప తన ప్రాబబుల్ స్క్వాడ్లో ఓపెనర్లుగా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ, యువ సారథి శుభ్మన్ గిల్ లకు తొలి ప్రాధాన్యం ఇచ్చాడు. వీరితో పాటు రిజర్వ్ ఓపెనర్గా బీహార్కు చెందిన 15 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయడం విశేషం. మిడిలార్డర్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ నమ్మకమైన పిల్లర్లుగా నిలవగా, వికెట్ కీపింగ్ బ్యాటర్లుగా కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ ఎంపికయ్యారు. రోహిత్, కోహ్లీ 2027 వరల్డ్ కప్ ఆడతారా లేదా అనే సందిగ్ధత ఉన్న సమయంలో ఉతప్ప వారిద్దరినీ కీలక ఎంపికలుగా పేర్కొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. ఐపీఎల్ రికార్డులు..
ఇంత చిన్న వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత జట్టు చర్చల్లోకి రావడానికి కారణం అతని అద్భుత ఫామ్. ఐపీఎల్ 2026 సీజన్లో 16 ఇన్నింగ్స్లు ఆడిన వైభవ్, 48.50 సగటుతో ఏకంగా 776 పరుగులు బాదాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 237.31గా నమోదైంది. అనంతరం సీనియర్ స్థాయిలో భారత టీ20 జట్టులోకి వచ్చిన వైభవ్, జులై 4న ఇంగ్లండ్పై ఓల్డ్ ట్రాఫోర్డ్లో అరంగేట్రం చేశాడు. 2027 నాటికి అతను వన్డేల్లో రోహిత్, గిల్లకు పటిష్టమైన బ్యాకప్గా ఎదుగుతాడని ఉతప్ప విశ్లేషించారు.
స్టార్ ఆల్రౌండర్లు.. బౌలింగ్ యూనిట్లో సర్ప్రైజ్..
పేస్ ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించనుండగా, స్పిన్ విభాగాన్ని రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నడిపించనున్నారు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ తో పాటు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ను ఎంపిక చేయడం మరో ఆసక్తికర అంశం.
ప్రముఖ ఆటగాళ్లకు మొండిచేయి..
ఉతప్ప ఎంపిక చేసిన జట్టులో పలువురు స్టార్ ఆటగాళ్లకు స్థానం దక్కలేదు. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి వంటి ప్రతిభావంతులను ఉతప్ప పరిగణనలోకి తీసుకోలేదు. భారత మాజీ క్రికెటర్ ఎంపిక చేసిన ఈ జట్టులో అనుభవజ్ఞులైన సీనియర్లతో పాటు యువ సంచలనాల కలయిక సమతుల్యంగా కనిపిస్తోంది. మెగా టోర్నీకి ఇంకా సమయం ఉన్నందున తుది ఎంపిక నాటికి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




