Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్యలో KFC ఔట్‌లెట్ ఏర్పాటు .. కండిషన్స్ అప్లై..

| Edited By: Surya Kala

Feb 08, 2024 | 3:39 PM

అయోధ్యలో నివసించే ముస్లింలు సైతం అక్కడ మాంసాహారం ముట్టరు. అంతగా తినాలి అనిపిస్తే అయోధ్యను ఆనుకున్న పట్టణం ఫైజాబాద్‌కు వెళ్లి తినేసి వస్తుంటారు. అలాంటి అయోధ్యలో ఫ్రైడ్ చికెన్‌కు పేరొందిన కేఎఫ్‌సీ (KFC) సంస్థను ఔట్‌లెట్ ఏర్పాటు చేయాల్సిందిగా అయోధ్య జిల్లా యంత్రాంగం కోరుతోంది. అయోధ్య పవిత్రకు భంగం కలగకుండా కేవలం శాఖాహార మెనూ మాత్రమే అందించేలా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఔట్‌లెట్ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొస్తే.. బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేరియన్ కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్ కావొచ్చు.

Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్యలో KFC ఔట్‌లెట్ ఏర్పాటు .. కండిషన్స్ అప్లై..
Pure Veg Kfc In Ayodhya
Follow us on

ఎఫ్‌సీ (KFC) అంటేనే నాన్-వెజ్ ఫాస్ట్‌ఫుడ్‌కు పెట్టింది పేరు. పేరులోనే ఫ్రైడ్ చికెన్ ఉంది. కేఎఫ్‌సీ అంటే ‘కెంటకీ ఫ్రైడ్ చికెన్’ సంక్షిప్త రూపం. మరోవైపు అయోధ్య అంటే హిందువులకే కాదు బౌద్ధ, జైన మతాలకు సైతం పవిత్ర పుణ్యక్షేత్రం. రామజన్మభూమి వద్ద భవ్యమైన ఆలయం నిర్మాణం కాకముందు నుంచే.. ఎన్నో ఏళ్లుగా, దశాబ్దాలుగా అక్కడ మాంసాహారంపై అప్రకటిత నిషేధం అమలవుతోంది. అయోధ్యలో నివసించే ముస్లింలు సైతం అక్కడ మాంసాహారం ముట్టరు. అంతగా తినాలి అనిపిస్తే అయోధ్యను ఆనుకున్న పట్టణం ఫైజాబాద్‌కు వెళ్లి తినేసి వస్తుంటారు. అలాంటి అయోధ్యలో ఫ్రైడ్ చికెన్‌కు పేరొందిన కేఎఫ్‌సీ (KFC) సంస్థను ఔట్‌లెట్ ఏర్పాటు చేయాల్సిందిగా అయోధ్య జిల్లా యంత్రాంగం కోరుతోంది. అయోధ్య పవిత్రకు భంగం కలగకుండా కేవలం శాఖాహార మెనూ మాత్రమే అందించేలా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఔట్‌లెట్ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ముందుకొస్తే.. బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటి వెజిటేరియన్ కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్ కావొచ్చు. ఇదంతా ఎందుకు అంటే.. పవిత్ర సంప్రదాయాలను గౌరవిస్తూనే అయోధ్యకు ఆధునికతను మేళవించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఇదే సరికొత్త భారతం

‘న్యూ ఇండియా’.. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం. ఒకప్పుడు పొరుగుదేశం అదిలిస్తే బెదిరిపోయే స్థితి నుంచి ప్రపంచంలోనే అగ్రరాజ్యాల్లో ఒకటిగా ఎదుగుతున్న దేశం. ఇప్పటికే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచి, శరవేగంగా ఇంకా పైపైకి దూసుకెళ్తోంది. ఐటీ, స్పేస్ సైన్సెస్, ఫార్మా, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో తనదైన ముద్ర వేసుకుంటోంది. ఈ న్యూ ఇండియా ఆధునిక ప్రపంచంతో పోటీపడుతూనే భారతీయత, సనాతన సంస్కృతి, సంప్రదాయాలకు కూడా పెద్దపీట వేస్తోంది. అయోధ్యలో రామజన్మభూమి వద్ద నిర్మించిన భవ్యమైన ఆలయం, ఆ నగరంలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టులు సరికొత్త భారతదేశంలో కొన్ని ఉదాహరణలు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దృష్టిని ఆకట్టుకున్న అయోధ్యను సందర్శించేందుకు వచ్చే నేటి తరం యువ భక్తులు, విదేశీ భక్తుల అభిరుచులకు తగిన ఏర్పాట్లు అయోధ్యలో ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే కేఎఫ్‌సీ వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌ను అయోధ్యకు ఆహ్వానిస్తోంది.

ఊపందుకుంటున్న ఆధ్యాత్మిక పర్యాటకం

దేశంలో పర్యాటక ప్రాంతాల్లో పర్యటించే యాత్రికుల కంటే పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించే భక్తుల సంఖ్యే ఎక్కువ అంటే అతిశయోక్తి కాదేమో. తిరుమల తిరుపతి దేవస్థానం, షిరిడీ సాయిబాబా ఆలయం, కాశీ, మథుర, చార్‌ధామ్, అమర్‌నాథ్.. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగా ఉంటుంది. విహార యాత్రలైనా, తీర్థయాత్రలైనా స్థానికంగా ఉపాధిని కల్పిస్తాయన్నది తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో అయోధ్య నగరం చేరింది. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య అంచనాలకు మించింది. దానికి తగ్గట్టే రైల్వే, విమానాయాన మౌలిక సదుపాయాలతో పాటు నగరంలోనూ భారీగా మౌలిక వసతుల ప్రాజెక్టులు నిర్మాణం జరుపుకుంటున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కొన్ని చోట్ల మాంసం, మద్యంపై నిషేధం అమల్లో ఉంటుంది. అక్కడున్న హోటళ్లు, రెస్టారెంట్లలో ఈ రెండింటికీ చోటు ఉండదు. అయోధ్యలోనూ ఆ సంప్రదాయం కొనసాగుతోంది. దాన్ని అలాగే కొనసాగిస్తూ.. ఆధునికతకు కూడా పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగానే KFC ని ప్రభుత్వం ఎంచుకుంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వేల సంఖ్యలో ఔట్‌లెట్లను కలిగి ఉంది. ప్రతిరోజూ ప్రపంచంలోని మూలమూలల్లో కొత్త కొత్త ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తూ ముందుకు సాగుతోంది. గ్లోబల్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లలో KFC ఒక పెద్ద బ్రాండ్. అయోధ్యలోనూ ఆ సంస్థ పాదముద్రలు ఉండాలని, అదే సమయంలో నగరం పవిత్రతకు భంగం కలుగకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో పూర్తి శాఖాహార ఔట్‌లెట్ ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వ యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ నగరంలో ఓ మల్టీనేషనల్ సంస్థ పూర్తి శాఖాహార 5-స్టార్ హోటల్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

ఫ్రైడ్ చికెన్‌కు, మాంసాహార రుచులకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన KFCలో పూర్తి శాఖాహార రుచులకు కూడా కొదవేం లేదు. వెజ్ జింజర్ బర్గర్, వెజ్ రోల్స్, వెజ్ రైస్ బౌల్, వెజ్ క్రిస్పర్ బర్గర్ సహా అనేక వెరైటీలు మెనూలో అందుబాటులో ఉన్నాయి. పైగా ఆధునికం, ఆరోగ్యం అనిపించే తరహా మెనూ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అయోధ్యను సందర్శించే యాత్రికులు అంతర్జాతీయ బ్రాండ్ రెస్టారెంట్ లేదు అన్న లోటు భావన కలగకుండా ఉండేందుకు KFC ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అదే బాటలో మరికొన్ని మెక్‌డోనాల్డ్స్ సహా మరికొన్ని ఇంటర్నేషనల్ ఫుడ్ చైన్ బ్రాండ్స్ అయోధ్యలో అడుగుపెట్టే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..