రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్ లోకి వెళ్తారుః ఉత్తమ్
దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్ లోకి వెళ్తారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ గెలిస్తే టీఆర్ఎస్ లోకి వెళ్తారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక నుంచి జూమ్ యాప్, ఫేస్బుక్ ద్వారా నియోజకవర్గంలోని మండల, గ్రామ కాంగ్రెస్ ఇన్ఛార్జిలతో ఆయన మాట్లాడారు. రాబోయే 36 గంటలు కీలకమని, కాంగ్రెస్ ఓటింగ్ను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రస్తుతం దుబ్బాకలో కాంగ్రెస్ పరిస్థితి బాగా ఉందని, ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ పార్టీకి కలిసోస్తుందన్నారు. ప్రస్తుతం దుబ్బాకలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉందని, దాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని పార్టీ ఇన్ఛార్జిలకు ఉత్తమ్ సూచించారు.
దుబ్బాక అభివృద్ధి పట్ల పాలకులు నిర్లక్ష్యం వహించారని ఉత్తమ్ ఆరోపించారు. దుబ్బాకను అభివృద్ధి చేసిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి.. ఏ గ్రామానికి వెళ్లినా ఆయన చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. రామలింగారెడ్డి దుబ్బాకలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభివృద్ధి సాధ్యం కాలేదన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, టీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అన్న ఉత్తమ్, రఘునందన్ పై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు. రఘునందన్రావు, హరీశ్ రావులు బంధువులు. రఘునందన్ రావు గెలిస్తే టీఆర్ఎస్ లో చేరడం ఖాయమని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.