జగన్కు జనసేనాని సలహా.. అప్రమత్తంగా ఉండాలంటూనే..!
‘‘ టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం అంటున్నారు... మరి ఆసుపత్రుల్లో రోగులకందించే సేవలపై శ్రద్ధ ఏది? ’’ అని ప్రశ్నించిన జనసేన పార్టీ అధినేత.. ‘‘ ఆక్సిజన్ కొరత... నాణ్యత లేని ఆహారం... వెంటిలేటర్లు, బెడ్స్ సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి ’’.....
యావత్ ప్రపంచం కరోనాతో వణికిపోతున్న తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ ప్రభుత్వానికి చురకలంటిస్తూనే సలహాలతో తెరమీదికి వచ్చారు. కరోనా యావత్ ప్రపంచానికి వచ్చిన ఉపద్రవమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. దానికి ఎదుర్కోవడంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వుండాలని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు జనసేనాని.
‘‘ టెస్టులు ఎక్కువగా చేస్తున్నాం అంటున్నారు… మరి ఆసుపత్రుల్లో రోగులకందించే సేవలపై శ్రద్ధ ఏది? ’’ అని ప్రశ్నించిన జనసేన పార్టీ అధినేత.. ‘‘ ఆక్సిజన్ కొరత… నాణ్యత లేని ఆహారం… వెంటిలేటర్లు, బెడ్స్ సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి ’’ అంటూ సలహా ఇచ్చారు. గృహ నిర్మాణం, ఇళ్ల పట్టాల సమస్యలపై బీజేపీతో కలసి పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు బాసటగా నిలుస్తామని తెలిపారు.
రేషన్ డీలర్ల సమస్యల్ని సర్కార్ పట్టించుకోకపోతే అంతిమంగా పేదలే ఇబ్బంది పడతారని జనసేనాని ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా వుండగా.. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ మంగళవారం భేటీ అయ్యింది. టెలికాన్ఫరెన్సు విధానంలో జరిగిన ఈ సమావేశంలో ఏపీ రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.