Tomar Meets Rajnath: కేంద్ర రక్షణ మంత్రిని కలిసిన వ్యవసాయ శాఖ మంత్రి… రైతులతో చర్చల నేపథ్యంలో…
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో చర్చలు జరపనున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కావడం...

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రైతులతో చర్చలు జరపనున్న నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. రైతుల ఆందోళనను విరమింప జేయడానికి గల అన్ని రకాల ఆప్షన్లపైనా రక్షణ మంత్రి రాజ్నాథ్తో తోమర్ చర్చించారని అధికార వర్గాల కథనం. కాగా, వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 39 రోజులుగా ఆందోళన సాగిస్తున్న రైతులు తమ నిరసనను ఉధృతం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ఎముకలు కొరికే చలిలోనూ, వర్షాలు కురుస్తున్నా రైతులు ఆందోళన నుంచి వెనుకడుగు వేయకపోవడం గమనార్హం. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి హామీనిస్తూ నూతన చట్టం చేయాలన్న డిమాండ్లను కేంద్రం ఆమోదించకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. అయితే రైతులు, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభనకు తెర దించడానికి మధ్యేమార్గాన్ని అనుసరించనున్నట్లు సమాచారం. అటల్ బీహారీ వాజపేయి హయాంలో రాజ్నాథ్ సింగ్ వ్యవసాయ మంత్రిగా పని చేశారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళనను విరమింప చేయడానికి రాజ్నాథ్ ముఖ్యంగా మారారు.