హైదరాబాద్లో మరో దారుణం చోటుచేసుకుంది. దిల్సుఖ్నగర్లో గల పట్టపగలే ఓ లాడ్జిలో యువతిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. స్ధానికంగా ఉన్న ఓ లాడ్జిలో మనస్విని అనే యువతిని గొంతుకోసి, ఆపై తానుకూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు వెంకటేశ్ అనే యువకుడు. ప్రస్తుతం హస్పిటల్లో యువతి చావుబతుకుల మధ్య మనస్విని కొట్టుమిట్టాడుతోంది. దిల్సుఖ్నగర్లోగల ఓ లాడ్జిలో మంగళవారం ఉదయం.. ప్రవీణ్ పేరుతో వెంకటేశ్ అనే యువకుడు రూమ్ బుక్ చేశాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో లాడ్జి గదిలో మనస్విని (22) అనే యువతితో ఘర్షణ పడి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుకోసి చంపే ప్రయత్నం చేశాడు. ఆపై తానుకూడా చేతిపై కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
తీవ్ర గాయాలపాలైన యువతిది హైదరాబాద్ బడంగ్పేట కాగా, నిందితుడు వెంకటేశ్ నెల్లూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారమే హత్యాయత్నానికి కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు వెంకటేశ్కు ఉస్మానియా హాస్పిటల్లో చికిత్స అందిస్తుండగా.. తీవ్రంగా గాయపడ్డ యువతికి చైతన్యపురిలోగల ఓమ్ని హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ హత్యాయత్నం ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మనస్విని గొంతుకు సర్జరీ చేశామని.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆమెకు చికిత్స అందిస్తున్న ఓమ్నీ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. యువతి మనస్వినికి చేతివేళ్లు కూడా తెగిపోయాయని, కత్తిపోట్ల వల్ల విపరీతంగా రక్తం పోయిందని, మరో రెండు రోజులు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమంటున్నారు.