Telangana: హమ్మయ్య.. ఇక రద్దీ కష్టాలు తీరినట్టే.. ఆ జిల్లాలకు కొత్త బస్సులు! ఈ రూట్లలోనే..
కరీంనగర్ నగరవాసుల దీర్ఘకాలిక కలను నెరవేర్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. గురువారం స్థానిక ఎమ్మెల్యే, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో కలిసి సిటీ మెట్రో సర్వీస్లను మంత్రి ఘనంగా ప్రారంభించారు. అనంతరం కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు ఆయన సిటీ బస్సులో ప్రయాణించారు.ప్రయాణికుల ఆదరణను బట్టి 24 గంటలు బస్సులు నడిపేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి.

కరీంనగర్ నగర ప్రజలకు మరింత మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించేందుకు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బస్ స్టేషన్లో సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం స్థానిక ఎమ్మెల్యేలు, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్ బస్ స్టేషన్ నుండి వాగేశ్వరి కాలేజీ వరకు సిటీ బస్సులో స్వయంగా ప్రయాణించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తొలి విడతగా కరీంనగర్ – వాగేశ్వరి కాలేజీ , కరీంనగర్ – చింతకుంట , కరీంనగర్ – కొత్తపల్లి హవేలీ మార్గాల్లో ఈ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా ఉన్న సిటీ బస్సుల డిమాండ్ను నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని, ఈ బస్సులు విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు ,మహిళలకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఉపాధి, విద్యా సంస్థల కేంద్రాలైన చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి, వాగేశ్వరి వైపు ప్రస్తుతం బస్సులు నడుపుతున్నామని.. త్వరలోనే మెడికల్ కాలేజీలు ఉన్న ప్రతిమ, చల్మడ, మానకొండూరు మార్గాల్లోనూ సేవలు విస్తరిస్తామని తెలిపారు
ప్రయాణికుల ఆదరణను బట్టి 24 గంటలు బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఒకే రూట్లో అదనపు బస్సులు కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. నగర ప్రజలంతా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని పొందుతున్నారన్న మంత్రి.. రాష్ట్రంలో కొత్త రూట్లలో బస్సులు ప్రారంభించడంతో పాటు, కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగుల నియామకాలు, పెండింగ్ బకాయిల చెల్లింపులు పూర్తి చేశామన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రతిరోజూ 35 లక్షల కిలోమీటర్ల మేర 65 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని, ప్రతి గ్రామానికి బస్సు సేవలు చేరడమే లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.. కరీంనగర్ నగరవాసుల దీర్ఘకాలిక కల నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు, మహిళలు, ఉద్యోగుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో ఈ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని, ప్రయాణికులను సమయానుకూలంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే ఆర్టీసీ ప్రాథమిక లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
