హెచ్1బీ వీసా హోల్డర్లకు గుడ్ న్యూస్.. 8 నెలలకు పొడిగింపు
కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని గత వారం అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది.

కోవిడ్-19 మహమ్మారి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన ఇండియన్లకు శుభవార్త. వీసా పొడిగింపుపై వచ్చిన అభ్యర్థనలను పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ప్రస్తుతం ఉన్న వీసాల వాలిడిటీని ఆరు వారాల నుంచి ఎనిమిది నెలలకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) తమ వెబ్సైట్లో కీలక నోటిఫికేషన్ పోస్ట్ చేసింది. కరోనా వైరస్ విస్తరణ నేపథ్యంలో వీసాల గడువు పొడిగింపు నిర్ణయాన్ని వెనువెంటనే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే ప్రతీ దరఖాస్తును పరిశీలించి ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ నిర్ణయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే గడువు పొడిగింపునకు సంబంధించి విశ్వసనీయమైన సాక్ష్యాలను దరఖాస్తు దారుడు సమర్పించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వీసాల గడువు ముగిసి అమెరికాలో చిక్కుకున్న భారతీయ పౌరులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట నిస్తుందని ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
కోవిడ్-19 పరిణామాల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరులకు హెచ్-1 బీ సహా, వివిధ రకాల వీసాల చెల్లుబాటును పొడిగించాలని లాస్ట్ వీక్ అమెరికాకు భారత ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో వలసదారులు వీసా గడువు ముగిసిన తరువాత అమెరికాలో ఉండేందుకు గడువు పొడిగింపు (ఈవోఎస్) లేదా స్టేటస్ మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా బహిష్కరణ వంటి ఇతర పరిణామాలను తప్పించుకోవచ్చు. హెచ్-1 బీ వీసా దారులు ఒకవేళ ఉద్యోగాలు కోల్పోయినట్టయితే అమెరికాలో ఉండే గడువును 60 రోజుల నుంచి 8 నెలలు వరకు పొడిగించినట్టు తెలిపింది.
కాగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఆర్థిక మందగమన పరిస్థితులు దాపురించాయి. ఈ నేపథ్యంలోనే హెచ్ 1బీ వీసా పరిమితిని తాత్కాలికంగా 60 నుంచి 180 రోజులకు పెంచాలని, కరోనా కారణంగా ప్రపంచమంతా గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్న, తాము ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఈ విపత్కర పరిస్థితుల్లో తమకు అండగా నిలవాలంటూ పలువురు టెకీలు అభ్యర్థించిన సంగతి తెలిసిందే.