ఇంటెలిజెన్స్ అధికారిని చంపేసింది మాజీ కౌన్సిలర్.. తేల్చి చెప్పేసిన కోర్టు..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్డూమా కోర్టు సోమవారం (జూలై 13) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్డూమా కోర్టు సోమవారం (జూలై 13) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. 2020లో జరిగిన ఈశాన్య ఢిల్లీ అల్లర్ల సమయంలో అంకిత్ శర్మ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం.. తాహిర్ హుస్సేన్, నజీమ్, ఖాసిం, అనాస్ మరియు జావేద్లను నిందితులుగా తేల్చింది. వీరిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 165, 188, 153A, 147, 148 కింద నేరారోపణలు రుజువైనట్లు స్పష్టం చేసింది. అయితే, నేరపూరిత కుట్ర ఆరోపణల నుండి మాత్రం తాహిర్ హుస్సేన్ను కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఇదే కేసులో సరైన ఆధారాలు లేకపోవడంతో మరో ఆరుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ విడిచిపెట్టింది.
దోషులకు విధించబోయే శిక్షపై కోర్టు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మంగళవారం (జూలై 14) నాడు న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన పూర్తి లిఖితపూర్వక ఉత్తర్వులను జారీ చేయనుంది. ఆ తర్వాత శిక్షా విధింపునకు సంబంధించిన వాదనల కోసం ప్రత్యేక తేదీని ఖరారు చేయనున్నారు.
ఇదిలావుంటే, ఫిబ్రవరి 2020లో ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం (CAA) అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఐబీ అధికారి అంకిత్ శర్మ దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మృతదేహం చాంద్బాగ్ ప్రాంతంలోని ఒక మురుగు కాలువలో లభ్యమైంది. ఈ ఘోరంపై అంకిత్ శర్మ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దయాల్పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నాటి ఎంసీడీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఇంటి నుంచే అల్లర్లు జరిగాయని, ఆయనే ప్రధాన సూత్రధారి అని ఢిల్లీ పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు. దాదాపు ఆరేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ఈ కీలక తీర్పును వెలువరించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
