Breaking: కెనడాలో భారీ సైబర్ దాడి
కెనాడాలో భారీ సైబర్ దాడి జరిగింది. ఆన్లైన్ ప్రభుత్వ సేవాలకు సంబంధించిన వేలాది ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కలవర పెడుతుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. జనంలో భయాన్ని, అనుమానాల్ని, ఆందోళనల్ని లక్ష్యంగా చేసుకొని అనేక మార్గాల్లో వైరస్లను కంప్యూటర్ లోకి చొప్పించేందుకు హ్యాకర్లు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంతగా సైబర్ దాడులు జరుగుతున్నాయని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. ఇంగ్లిష్, ఫ్రెంచ్, జపనీస్, టర్కిష్ సహా ఇటాలియన్ భాషల్ని ఉపయోగిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సామాన్యులను, పరిశ్రమల్ని, రవాణా వ్యవస్థల్ని, ఆరోగ్యం, ఇన్సూరెన్స్, ఆతిథ్యం, తయారీ రంగాలను సైబర్ క్రిమినల్స్ లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కెనడా ప్రభుత్వ సైట్లను టార్గెట్ చేశారు.
కెనాడాలో భారీ సైబర్ దాడి జరిగింది. ఆన్లైన్ ప్రభుత్వ సేవాలకు సంబంధించిన వేలాది ఖాతాలు హ్యాకింగ్కు గురైనట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. సుమారు 30 సమాఖ్య విభాగాలు, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలు ఉపయోగించే జీసీకీ(GCKey)సేవను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు జరిగినట్లు ట్రెజరీ బోర్డ్ ఆఫ్ కెనడా సెక్రటేరియట్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 9,401 మంది జీసీకీ ఖాతాదారుల పాస్వర్డ్లను సైబర్ నేరగాళ్లు తస్కరించారని సైబర్ అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అన్నింటిని వెంటనే తొలగించినట్లు తెలియజేశారు. అలాగే 5,500 రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలను లక్ష్యంగా చేసుకొని మరో దాడి జరిగిందని, హ్యాకింగ్కు గురైన అకౌంట్లను వెంటనే గుర్తించి తొలగించామని చెప్పారు.
పెద్ద మొత్తంలో ప్రభుత్వ ఖాతాలు హాకింగ్కు గురికావడంతో కెనడా ప్రభుత్వం అప్రమత్తమైంది. గోప్యత ఉల్లంఘనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. కాగా, రెవెన్యూ ఏజెన్సీ ఖాతాలతో సంబంధం ఉన్న బ్యాంకింగ్ సమాచారాన్ని మార్చాలంటూ ఆగస్ట్ మొదటి వారంలోనే ఫిర్యాదు చేసినా ప్రభుత్వాధికారలు పట్టించుకోలేదని పలువురు ఆరోపించారు. ఫలితంగా కరోనావైరస్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం అందిచిన ఆర్థిక సాయం అర్హులకు అందకుండా పోయిందని ఆ దేశ మీడియా పేర్కొంది.