కరోనా పేషేంట్ పరార్.. ఊరంతా క్వారంటైన్ లో..
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పారిపోయారు.
కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన ఓ యువకుడు, అతని కుటుంబ సభ్యులు పారిపోయారు. దీంతో ఓ 40 కుటుంబాలను క్వారంటైన్ లో ఉంచారు పోలీసులు, వైద్యాధికారులు. యూపీలోని హర్దోయి జిల్లాకు చెందిన ఓ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం ఢిల్లీకి వలస వెళ్లారు. ఢిల్లీ నుంచి ఈ నెల 15వ తేదీన తమ సొంత గ్రామమైన తెర్వాదహిగావన్ కు చేరుకున్నారు. 16వ తేదీన ఓ పెళ్లికి వారు హాజరయ్యారు.
కాగా.. ఈ కుటుంబంలో ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించడంతో.. రక్త నమూనాలను వైద్యులకు ఇచ్చారు. ఆరుగురు కుటుంబ సభ్యుల్లో 18 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన వైద్యాధికారులు.. ఆ కుటుంబం వద్దకు చేరుకునేందుకు సిద్ధమయ్యారు. అంతలోపే యువకుడితో పాటు మిగతా కుటుంబ సభ్యులు పారిపోయారు. ముందస్తు జాగ్రత్తగా ఆ గ్రామంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. గ్రామంలోని 40 కుటుంబాలను క్వారంటైన్ లో ఉంచారు. యువకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.