Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువే.. పాజిటివ్ కేసుల రేటు 3.8 శాతం.. శీతకాలం మరింత అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్యశాఖ

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. మొదటి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తపడ్డారు.

తెలంగాణలో కరోనా తీవ్రత తక్కువే.. పాజిటివ్ కేసుల రేటు 3.8 శాతం.. శీతకాలం మరింత అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్యశాఖ
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 21, 2020 | 5:32 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం ముందు వరుసలో ఉంది. మొదటి నుంచి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరగకుండా జాగ్రత్తపడ్డారు. కాగా, తెలంగాణలో నవంబరు నెలలో చాలా తక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డా. శ్రీనివాస్‌ వెల్లడించారు. ఈ వారంలో అత్యంత తక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 లక్షలకుపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించారు. గత నాలుగు నెలలుగా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచడంతోపాటు, ప్రభుత్వం తీసుకున్న నివారణ చర్యల వల్ల రాష్ట్రంలో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. అటు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 1,12,892 కేసులు నమోదయ్యాయని, నవంబరు నెలలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల రేటు 3.8 శాతంగా ఉందని తెలిపారు. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లోనే తక్కువ కేసులు ఉన్నట్లు శ్రీనివాస్‌ వివరించారు.

దేశంలో మొట్టమొదట లాక్‌డౌన్‌ అమలు చేసిన రాష్ట్రం తెలంగాణనే అని శ్రీనివాస్‌ గుర్తు చేశారు. కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి కంటైన్మెంట్ చేసి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యామన్నారు. ముఖ్యంగా ప్రజలకు నిత్యావసరాలతో, కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా పరీక్షలు నిర్వహించామన్నారు. బోనాలు, గణేష్ నవరాత్రి, దసరా పండుగల సమయంలో కాస్త ఆందోళన చెందినప్పటికీ కేసుల సంఖ్య పెరగకపోవడం సంతోషకరమన్నారు. మరో రెండు మూడు నెలల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే అవకాశముందని శ్రీనివాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మరోవైపు, కరోనా నిర్ధారణ పరీక్షలను కూడా పెంచాలని నిర్ణయించినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్ష ధరలు తగ్గించామని, నూతన ధరలు అమలు చేయనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్‌ హెచ్చరించారు. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులను తక్కువ ధరకు చేస్తున్నామని అన్నారు. కిట్‌ ఖర్చు కేవలం రూ.250 మాత్రమే పడుతుందని, ర్యాపిడ్ పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ల్యాబ్‌లు, హాస్పిటల్స్ ముందుకు వస్తే అనుమతి ఇస్తామని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లాల అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఒక్కోరోజులో 65 వేల వరకు నిర్ధారణ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్ని ప్రైవేటు వైద్య కళాశాల ల్యాబ్‌లలో ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్షలకు అనుమతులు వచ్చాయని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కార్యకర్తలు మాస్క్‌ ధరించి, భౌతిక దూరం పాటించేలా నేతలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.