అసోంను వణికిస్తున్న కరోనా…
అసోంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 94వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగొయ్కు..
అసోంలో కరోనా మహమ్మారి విజృంభణ రోజు రోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 94వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత తరుణ్ గొగొయ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. 85 ఏళ్ల గొగోయ్ నిన్న కరోనా పరీక్షలు చేయించుకోగా.. కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విటర్ ఖాతాలో వెల్లడించారు.
గత కొద్ది రోజులుగా తనను కలిసినవారు తక్షణమే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొన్ని రోజుల నుంచి స్వల్పంగా దగ్గు, జలుబు ఉన్నట్టు సమాచారం. గొగోయ్కి కరోనా లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, అందువల్ల ప్రస్తుతం హోం ఐసోలేషన్లోనే ఉన్నట్టు పార్టీ నేతలు చెప్పారు. వయస్సు రీత్యా అవసరమైతే వైద్యుల సలహాలు తీసుకొని ఆస్పత్రిలో చేరుస్తామని అన్నారు.
గొగొయ్కి కరోనా సోకడంపై రాష్ట్ర వైద్యశాఖమంత్రి హిమంత బిశ్వశర్మ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయనకు చికిత్స అందించేందుకు వీలుగా వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. అసోంలో నిన్న ఒక్కరోజే 1973 కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 94,592కి చేరింది. వీరిలో 74,814 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 260మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 19518 యాక్టివ్ కేసులు ఉన్నాయి.