పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ విద్యుత్ ప్రాజెక్ట్ కి చైనా ఫ్లాన్..!
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో భారీ విద్యుత్ ప్రాజెక్ట్ను ఫ్లాన్ చేసింది డ్రాగన్ దేశం. 1,124 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం.
ఎన్ని హెచ్చరికలు చేసిన భారత్ పట్ల చైనా కుయుక్తులు మానడం లేదు. తాజాగా భారత్ అభ్యంతరాలను కాదని పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లో భారీ విద్యుత్ ప్రాజెక్ట్ను ఫ్లాన్ చేసింది డ్రాగన్ దేశం. ఇప్పటికే సియిచిన్ గ్లేసియర్, టిబెట్ సరిహద్దుల్లో వాతావరణం వేడివేడిగా ఉన్న నేపథ్యంలో పాకిస్థాన్ సహకారంతో పీవోకేలో ఏకంగా 1,124 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు చైనాకు పాకిస్థాన్ కూడా అనుమతించింది. ఈ మేరకు ఇస్లామాబాద్లో పాక్ విద్యుత్శాఖ మంత్రి ఓమర్ అయూబ్ ఆధ్వర్యంలో జరిగిన 127వ ప్రైవేట్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బోర్డ్ (పీపీఐబీ) సమావేశంలో కోహలా హైడ్రోపవర్ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలపై చర్చించారు. చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (సీపీఈసీ) కింద 1,124 మెగావాటల్ కోహలా జలవిద్యుత్ ప్రాజెక్టును అమలుచేయడానికి చైనాకు చెందిన త్రీ గోర్జెస్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, పీపీఐబీలతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక కథనం ప్రచురించింది. ఈ ప్రాజెక్ట్ను జీలం నదిపై నిర్మించాలని, పాకిస్థాన్లోని ప్రజలకు తక్కువ ఖర్చుతో ఏటా ఐదు బిలియన్ యూనిట్లకుపైగా విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం ఖరారు అయ్యింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2.4 బిలియన్ డాలర్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. 3,000 కిలోమీటర్ల పొడవైన సీపీఈసీ.. చైనా, పాకిస్థాన్ మధ్య రైలు, రహదారి, పైపులైన్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లతో అనుసంధానించనున్నారు. ఇది చైనాలోని జిన్జియాంగ్ రాష్ట్రాన్ని పాకిస్థాన్ గ్వాడార్ నౌకాశ్రయంతో కలుపుతుంది. దీంతో అరేబియా సముద్రంలోకి చైనా ప్రవేశానికి మార్గం సుగమం అవుతుంది. సీపీఈసీ పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా పోతుండటం పట్ల భారత్ నిరసనలు వ్యక్తం చేసినప్పటికీ చైనా పట్టించుకోవడం లేదు. గత నెలలో గిల్గిట్-బాల్టిస్థాన్లో ఆనకట్ట నిర్మించేందుకు మెగా కాంట్రాక్ట్ ఇవ్వడం పట్ల పాకిస్థాన్కు భారత్ గట్టి నిరసన తెలిపింది. పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకొన్న భూభాగంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం సరైన చర్య కాదని భారత్ సూచించింది. ఒకవైపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతూనే పాకిస్తాన్ తో కలిసి కుట్రలకు తెర లేపుతోంది చైనా. భారత్ ఎన్నిసార్లు హెచ్చరించిన తన వక్ర బుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది డ్రాగన్ దేశం.