యోగా గురవు రామ్దేవ్ బాబాకు స్వల్ప ఊరట
యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకి ఊరట లభించింది. పతంజలి సంస్థ తయారు చేసిన కొరోనిల్ ను రోగనిరోధక శక్తి కలిగిన మందుగా మాత్రమే విక్రయించుకునేందుకు అనుమతినిచ్చింది కేంద్రం.
యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి సంస్థకి ఊరట లభించింది. పతంజలి సంస్థ తయారు చేసిన కొరోనిల్ ను రోగనిరోధక శక్తి కలిగిన మందుగా మాత్రమే విక్రయించుకునేందుకు అనుమతినిచ్చింది కేంద్రం. కోవిడ్19 వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం కొరోనిల్ ఔషధాన్ని కనుగొన్నట్లు పతంజలి సంస్థ గత వారం వెల్లడించింది. అయితే, ఆ ఔషధానికి ఆయుష్ మంత్రిత్వశాఖ అనుమతి లేదని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ మందు వాడటం వల్లే పూర్తి స్థాయి కరోనా నయం అయ్యేందుకు ఆధారాలు లేవని.. కొరోనిల్ క్రయ, విక్రయాలపై నిషేధం విధించింది. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రం ఆదేశించింది. దీంతో పతంజలి సమర్పించిన సమాచారంతో సంతృప్తి చెందిన కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ‘కరోనిల్’ ఔషధాన్ని రోగనిరోధక శక్తిని పెంచే మందుగా మాత్రమే విక్రయించవచ్చని ధృవీకరించింది. కానీ, కరోనా వైరస్ నివారణకు కాదని స్పష్టం చేసింది.
అంతకుముందు తాము తయారు చేసిన కరోనిల్ ఔషధాన్ని తీసుకున్న వారిలో 67 శాతం మంది కేవలం మూడు రోజుల్లో కోలుకున్నట్లు పతంజలి సంస్థ వెల్లడించింది. ఇదే విషయాన్ని యోగా గురువు బాబా రాందేవ్ స్వయంగా ప్రకటించారు. ఏడు రోజుల్లో నూరు శాతం కోలుకున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన డేటాను ఆయుష్ మంత్రిత్వశాఖకు సమర్పించిన నివేదిక పట్ల భారత ఆయుష్ మంత్రిత్వశాఖ సంతృప్తి చెందింది. దీని కరోనా వ్యాదిగ్రస్తుల్లో ఇమ్యూనిటీని పెంచే మందుగా మాత్రమే ప్రచారం చేసుకోవాలని అనుమతినిచ్చింది. తాము చేసిన ట్రయల్స్లో 45 మంది రోగులు కోవిడ్ నెగటివ్గా తేలినట్లు రాందేవ్ చెప్పారు. ఆయుష్ మంత్రిత్వశాఖ, పతంజలి మధ్య ఎటువంటి బేధాభిప్రాయం లేదన్నారు. దివ్య కరోనిల్ ట్యాబ్లెట్ల ఉత్పత్తి, పంపిణీకి ఆయుష్ మంత్రిత్వశాఖ నుంచి అనుమతి వచ్చినట్లు పతంజలి రీసర్చ్ ఫౌండేషన్ పేర్కొన్నది. హరిద్వార్లోని పతంజలి రీసర్చ్ ఇన్స్టిట్యూట్, జైపూర్లోని నిమ్స్ యూనివర్సిటీ సంయుక్తంగా కోవిడ్19 పేషెంట్లపై తమ ట్యాబ్లెట్తో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు పతంజలి సంస్థ పేర్కొన్నది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ, ఆయుర్వేద మరియు యునాని సర్వీసెస్ మంజూరు చేసిన తయారీ లైసెన్సుల ప్రకారం, పతంజలి తన దివా కరోనిల్ టాబ్లెట్, దివ్య స్వసరి వతి, దివ్య అను తాలియాను భారతదేశం అంతటా తయారు చేసి పంపిణీ చేయడానికి అనుమతినిచ్చింది. కోవిడ్ 19 రోగుల్లో ఇమ్యునిటీ బూస్టర్ తయారీకి మాత్రమే కంపెనీకి లైసెన్స్ ఇచ్చినట్లు తెలిపింది.