అధిష్ఠానం జోక్యంతో మారుతున్న రాజస్తాన్ రాజకీయం
సచిన్ పైలట్ తో కాంగ్రెస్ హైకమాండే స్వయంగా సమావేశమై చర్చలు జరుపుతోంది. పలు అంశాలపై రాహుల్ తో పైలట్ చర్చించినట్లు తెలిసింది. పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ తమ అసంతృప్తి పార్టీపైన కాదని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పైనే అన్న విషయాన్ని ...
రాజస్తాన్ రాజకీయాలు మరో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది నెలలుగా రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ముచ్చెమటలు పట్టించిన సచిన్ ఫైలట్ కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కావడం కొత్త సమీకరణలు మొదలయ్యాయి. మరో నాలుగు రోజుల్లో రాజస్థాన్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయనగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ నాయకులకు చిక్కకుండా ఉన్న సచిన్ పైలట్.. సోమవారం రాహుల్, ప్రియాంక వాద్రలతో గంటన్నర పాటు సమావేశమైనట్లు అక్కడి రాజకీయవర్గాలు చెప్తున్నాయి. పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
సచిన్ పైలట్ తో కాంగ్రెస్ హైకమాండే స్వయంగా సమావేశమై చర్చలు జరుపుతోంది. పలు అంశాలపై రాహుల్ తో పైలట్ చర్చించినట్లు తెలిసింది. పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ తమ అసంతృప్తి పార్టీపైన కాదని, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పైనే అన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సచిన్ పైలట్ పార్టీ నాయకత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని కొందరు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. రాజస్తాన్ ప్రభుత్వంలో ప్రస్తుత నెలకొన్న సంక్షోభానికి త్వరలోనే తెరపడనున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు. మరోవైపు, ఇప్పటికే రాజద్రోహ కేసు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు త్వరలోనే ఉపశమనం కలగనుంది.
ఇలా ఉండగా, ఆగస్టు 11 న బీజేపీ శాసనసభ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గుజరాత్ వెళ్లిన 18 మంది ఎమ్మెల్యేలను కూడా రప్పించే ప్రయత్నాలు చేస్తున్నది. జైపూర్లోని హోటల్ క్రౌన్ ప్లాజాలో మంగళవారం సాయంత్రం 4 గంటలకు శాసనసభ పార్టీ సమావేశం జరుగనున్నది.
అంతకుముందు ఆదివారం జైసల్మేర్లో జరిగిన కాంగ్రెస్ శాసనసభ పార్టీ సమావేశం.. సచిన్ పైలట్ వర్గంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తిరుగుబాటుదారులను తప్పించాల్సిందేనని గెహ్లాట్ వర్గం పట్టుబడుతోంది. మరోవైపు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి గెహ్లాట్ ఎమోషనల్ లెటర్ రాశారు. ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్రలో మీరు భాగం కాకూడదని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆదివారం అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఎమోషనల్ లెటర్ రాశారు. మనస్సాక్షి ప్రకారం మసలుకోండి. ఈ లేఖలో పేర్కొన్నారు.