శంభో శంకర..కొత్తింటికి పునాది తవ్వుతుండగా కనిపించిన అద్భుత దృశ్యం
కొత్త ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా పురాతన దేవతామూర్తుల విగ్రహాలు బయటపడిన ఆసక్తికర ఘటన ఇది. తమిళనాడులోని నాగపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్మికులు పునాది తవ్వుతుండగా శివ-పార్వతుల విగ్రహం, నటరాజస్వామి విగ్రహం బయటపడింది. ఈ ఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.

తమిళనాడులోని నాగపట్నంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నాగపట్నంలోని న్యూ బీచ్ రోడ్డుపై రామప్రసన్న అనే వ్యక్తికి ఖాళీ ఇంటి స్థలం ఉంది. ఈ స్థలంలో కొత్త ఇల్లు నిర్మాణ పనులను ఇటీవల ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా పునాది కోసం కార్మికులు భూమిని తవ్వే కార్యక్రమం కొనసాగుతోంది. సోమవారం రోజు రాత్రి పునాది కోసం భూమిని తవ్వుతుండగా.. రెండు అడుగుల ఎత్తైన శివపార్వతుల విగ్రహం కనిపించింది. దీన్ని చూసి భవన నిర్మాణ కార్మికులు ఆశ్చర్యానికి గురైయ్యారు. తవ్వకాలు కొనసాగించగా.. రెండు అడుగుల ఎత్తైన మరో నటరాజస్వామి విగ్రహం, మరిన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా కనిపించాయి.
ఈ విషయం చుట్టుపక్కల గ్రామాల్లో వ్యాపించడంతో, ఆ పురాతన విగ్రహాలను చూడటానికి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పురాతన దేవతామూర్తుల విగ్రహాలను వారు ఆసక్తిగా తిలకించారు.
పురాతన విగ్రహాలు బయటపడినట్లు ఇంటి యజమాని స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. ఇంటి నిర్మాణానికి సంబంధించి పునాది తవ్వకాల్లో బయటపడిన ఆ విగ్రహాలను వారు పరిశీలించారు. ఈ విగ్రహాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకుని, తదుపరి పరిశోధనల నిమిత్తం నాగపట్నం తహశీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ పురాతన విగ్రహాలు 8 లేదా 9వ శతాబ్ధానికి చెందిన చోళ రాజుల కాలంనాటివి కావొచ్చని పురావస్తు శాఖ అధికారులు తెలిపారు. భూమిలో ఇంకా ఏవైనా విగ్రహాలు ఉన్నాయేమోనని పురావస్తు శాఖ అధికారులు పరిశీలన జరుపుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ కథనాలు చదవండి
