ధరణి పోర్టల్ ఆసరాగా.. ఒకే భూమిని ఇద్దరికి అమ్మిన మహిళ అరెస్ట్
చట్టంలోని లొసుగులు అడ్డం పెట్టుకుని మోసానికి యత్నించిన ఓ మహిళ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.
చట్టంలోని లొసుగులు అడ్డం పెట్టుకుని మోసానికి యత్నించిన ఓ మహిళ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ను ఆ మహిళ దుర్వినియోగానికి పాల్పడింది. ఒక వ్యక్తికి అమ్మిని భూమిని రెండోసారి తన కూతురి పేర రిజిస్ట్రేషన్ చేయించుకుని రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులకు అడ్డంగా దొరికిపోయింది. బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో వెలుగుచూసింది.
జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ రంగనాథ్లు శుక్రవారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించి మహిళ మోసానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తేరా విజయలక్ష్మి అనే మహిళకు పెద్ద ఆడిశర్లపల్లిలో 1.32 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీన్ని 2019 ఆగస్టు 14వ తేదీన కోట్ల జగదీశ్ అనే వ్యక్తికి విక్రయిస్తూ సేల్ డెడ్ చేసింది. అయితే, జగదీశ్ ఈ భూమిని నాలా కన్వర్షన్ చేస్తూ ప్లాట్స్ గా చేసి విక్రయించారు. ఆ భూమిని జగదీశ్ కొనుగోలు చేశాక మ్యూటేషన్ చేయించకుండానే నేరుగా సేల్ డీడ్ తోనే ప్లాట్స్ గా అమ్మేశాడు. జగదీశ్ మ్యూటేషన్ చేయించుకోక పోవడంతో ఆ భూమి రెవెన్యూ రికార్డ్స్ లో తేరా విజయలక్ష్మి పేరుతోనే కొనసాగుతున్నది. ధరణి పోర్టల్ లోనూ అలాగే నమోదైంది. దీన్ని ఆసరాగా చేసుకుని విజయలక్ష్మి అదే భూమిని రెండోసారి తన కూతురు ప్రియాంక పేరుతో ఈ నెల 4వ తేదీన గిఫ్ట్ డీడ్ చేసింది. దీంతో బాధితుడు జగదీశ్ రెవెన్యూ అధికారులకు, పోలీసులకు పిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకుని విచారించణ చేపట్టడంతో వాస్తవాలు వెలుగుచూశాయి.
ధరణి పోర్టల్ ను దుర్వినియోగం చేస్తూ తప్పుడు పద్దతిలో విజయలక్ష్మి మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా నల్లగొండ జిల్లా పోలీసులు గుర్తించారు. దీంతో విజయలక్ష్మిపై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ రంగనాధ్ వెల్లడించారు. ఇంకా ఎక్కడైనా ఇలాంటి తప్పుడు పద్ధతులు అవలభించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విక్రయించిన భూమి ఏదైనా కారణంగా మ్యూటేషన్ కాకుండా ధరణి పోర్టల్ లో వివరాలు ఉన్నంత మాత్రాన ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని ఎస్పీ హెచ్చరించారు. ఏదైనా కొత్త విధానం ప్రవేశ పెట్టినప్పుడు ప్రారంభంలో కొన్ని సమస్యలు రావడం సహజమని, అంత మాత్రాన దాన్ని దుర్వినియోగం చేస్తామంటే చట్టం ఊరుకోదని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్పష్టం చేశారు.