ఒమాన్ తీరంలో నౌకపై అమెరికా దాడి – ముగ్గురు భారతీయ నావికులు మృతి
ఒమాన్ తీరానికి సమీపంలో ఉన్న గల్ఫ్ ఆఫ్ ఒమాన్ ప్రాంతంలో జరిగిన అమెరికా దాడిలో భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. కేంద్ర నౌకాశ్రయాలు, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ఘటనలో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు ధృవీకరించారు.

ఒమాన్ తీర ప్రాంతంలో జరిగిన దాడిలో ఓ నౌకపై పని చేస్తున్న ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ ఘటన అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో భద్రతపై మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఒమాన్ సమీప సముద్ర ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకపై క్షిపణి దాడి జరిగింది. మరణించిన వారిని డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజిన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్గా గుర్తించారు. పలావు ఫ్లాగ్ కలిగిన ‘సెట్టెబెల్లో’ ఆయిల్ ట్యాంకర్ పై యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) దళాల దాడులు చేశాయి. ఆయిల్ ట్యాంకర్లో ఆ సమయంలో మొత్తం 24 మంది భారతీయులు ఉన్నారు. ఇంజిన్ రూమ్ లక్ష్యంగా అమెరికా బాంబుల వర్షం కురిపించింది. అమెరికా యుద్ధ విమానాల దాడితో నౌకలో భారీ మంటలు చెలరేగాయి.. ఈ దాడిలో ముగ్గురు భారతీయులు చనిపోగా.. మిగిలిన 21 మంది భారతీయులను ఒమన్ సైన్యం రక్షించింది.
కేంద్ర పోర్టులు, నౌకాశ్రయాలు, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ముగ్గురు భారతీయ నావికులు దాడిలో మరణించారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం సానుభూతి తెలిపింది. గాయపడిన ఇతర సిబ్బందికి అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
భారత ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికా దుశ్చర్యపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఘటనపై ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ఉన్నతాధికారిని (చార్జ్ డి అఫైర్స్) పిలిపించి కౌంటర్ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. ఇరాన్ నౌకాశ్రయాలపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘించి ఆయిల్ రవాణా చేస్తున్నందుకే దాడి చేశామన్న యూఎస్ మిలిటరీ చెప్పుకొచ్చింది.
భారత రాయబార కార్యాలయం, సముద్ర భద్రతా సంస్థలు, నౌక యాజమాన్యంతో కలిసి వివరాలు సేకరిస్తున్నాయి. భారత ప్రభుత్వం నౌక కంపెనీ, సంబంధిత దేశాల అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తోంది. మృతదేహాలను భారత్కు తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించింది.
