Organ Donation: మరణంలోను మహాదాత.. తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు
Organ Donation: మరణంలోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మెదక్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు. తాను మరణిస్తూ ఐదుగురికి ప్రాణదానం చేశారు. వారం రోజుల క్రితం ఇంట్లో పని చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడి పోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో..

Organ Donation: మరణంలోనూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మెదక్ జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు.. తాను చనిపోతూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపారు.. మరో వైపు బ్రెయిన్ డెడ్ అయిన తన తండ్రి అవయవాలను దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ కుటుంబ సభ్యులు.. వివరాల్లోకి వెళ్తే మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన జీడి భూమా గౌడ్ సామాన్య రైతు..చిన్న వ్యాపారి.. అందరితో కలిసిమెలిసి ఉండే మంచి మనసున్న వ్యక్తి. కానీ విధి ఆయన్ను ప్రమాదం రూపంలో కబళించింది.
వారం రోజుల క్రితం ఇంట్లో పని చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు కిందపడి పోయారు. తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్లో ని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ భూమా గౌడ్ ఆరోగ్యం క్షీణించింది. చికిత్స పొందుతూ ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. భూమా గౌడ్ నీ కోల్పోయిన ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసముద్రంలో మునిగిపోయింది. అయితే ఈ తీరని శోకంలోనూ ఆ కుటుంబం ఓ గొప్ప నిర్ణయం తీసుకుంది. భూమా గౌడ్ పార్థివ దేహాన్ని మట్టిలో కలిపే కంటే మరొకరికి ప్రాణదానం చేయాలని భావించారు. ప్రభుత్వ ‘జీవన్ దాన్’ సంస్థను సంప్రదించి అవయవ దానానికి ముందుకు వచ్చారు.
కుటుంబ సభ్యుల అంగీకారంతో జీవన్ దాన్ ట్రస్ట్ ప్రతినిధులు భూమా గౌడ్ శరీరం నుండి రెండు కళ్ళు, రెండు కిడ్నీలు, కాలేయాన్ని సేకరించారు. వీటి ద్వారా ఐదుగురు అంధులకు, దీర్ఘకాలిక రోగులకు పునర్జన్మ లభించింది. అవయవాల సేకరణ అనంతరం జీవన్ దాన్ ప్రతి నిధులు భూమా గౌడ్ పార్థివ దేహానికి ఘనంగా నివాళు లర్పించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపిన భూమా గౌడ్ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవు తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
