New Delhi: ఒమన్లో వాణిజ్య నౌకపై దాడి.. అమెరికా ప్రతినిధికి భారత్ అభ్యంతర లేఖ
రోజురోజుకూ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తాజాగా ఒమన్ తీరంలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. ఈ దాడిలో నౌకలోని ఇంజన్ భారీ పేలుడు సంభవించింది.. నౌకలోని 24 మంది సిబ్బంది సముద్రంలో పడిపోయారు. వెంటనే సమాచారం అందుకున్న ఒమన్ నౌకాదళం హెలికాప్టర్ల సహాయంతో 21 మంది భారతీయులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చగా ముగ్గురు మాత్రం మిస్సయ్యారు. వారి కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల రోజురోజుకూ తీవ్రతరం అవుతున్నాయి. అమెరికాకు చెందిన హెలికాప్టర్ను ఇరాన్ పేల్చేయడంతో మరోసారి పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తమ హెలికాప్టర్ను పేల్చేయడంతో అమెరికా ఇరాన్పై దాడికి సిద్దమైంది. అయితే తాజాగా పలావు దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ఎంటీ మారివెక్స్ అనే ఆయిల్ ట్యాంకర్పై ఒమన్లోని మసిరా ద్వీపం సమీపంలో దాడి జరిగింది.ఈ దాడి కారణంగా నౌక ఇంజిన్ గదిలో భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దీంతో నౌకలోకి నీరు చేరి.. లైఫ్ బోట్లు కూడా దెబ్బతినడంతో సిబ్బంది వెంటనే అత్యవసర సహాయం కోసం కోరారు
అయితే ప్రమాదం గురించి తెలిసిన వెంటనే భారత కోస్ట్ గార్డ్ , ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ వెంటనే స్పందించి ఒమన్ మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ సెంటర్ సహాయాన్ని కోరాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ఒమన్ నౌకాదళం యుద్ధప్రాతిపదికన రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించి నౌకలో ఉన్న 21 మంది భారతీయ నావికులను విజయవంతంగా ఎయిర్లిఫ్ట్ చేసి సురక్షితంగా ఒమన్ తీరానికి చేర్చారు.
అయితే నౌకలో ఉన్న మరో ముగ్గురు సిబ్బంది ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో వారి ఆచూకీ కోసం సముద్రంలో గాలింపు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అటు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, మస్కట్లోని భారత రాయబార కార్యాలయం సైతం ఒమన్ అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సిబ్బందికి అవసరమైన వైద్య సహాయం, వసతిని ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టింది.
అయితే ఈ నౌకపై జరిగిన దాడి భారత్ తీవ్రంగా ఖండించింది. దాడిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీలోని అమెరికా టాప్ డిప్లొమాట్కు నిరసన పత్రం అందజేసింది. అలాగే ఈ నౌకలో ఉన్న వారిలో 21 మంది భారతీయులను సురక్షితంగా రక్షించగా, మరో ముగ్గురు ఇంకా గల్లంతయ్యారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.
మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
