జీహెచ్ఎంసీ బరిలో జనసేన.. బీజేపీకి సంకటమేనా? పొత్తుపై కమలంలో మల్లగుల్లాలు
మంగళవారం మోగిన గ్రేటర్ ఎన్నికల బరిలోకి జనసేన పార్టీకి కూడా దిగనున్నది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ప్రకటించారు. తెలంగాణలో పార్టీకి క్రియాశీలక వర్కర్లున్న నేపథ్యంలో...

Janasena to contect GHMC polls: మంగళవారం మోగిన గ్రేటర్ ఎన్నికల బరిలోకి జనసేన పార్టీకి కూడా దిగనున్నది. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో ప్రకటించారు. తెలంగాణలో పార్టీకి క్రియాశీలక వర్కర్లున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. క్షేత్ర స్థాయి కార్యకర్తల అభీష్టం మేరకు జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలపనున్నట్లు ఆయన వివరించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్ మంగళవారం వెలువడిన సంగతి తెలిసిందే. నవంబర్ 18వ తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ జీహెచ్ఎంసీ బరిలో తమ అభ్యర్థులను నిలపనున్నట్లు వెల్లడించారు. ‘‘ తెలంగాణ రాష్ట్రంలోనూ, జీ.హెచ్.ఎమ్.సీ. పరిధిలోను పార్టీలో క్రియాశీలకంగా చాలా మంది ఉన్నారు.. కార్యకర్తలు, యువ జనసైనికుల నుంచి పోటీ చేయాలని పలు విజ్ఞప్తులు వచ్చాయి.. వారి వినతి మేరకు జీ.హెచ్.ఎమ్.సీ. ఎన్నికల్లో పోటీకి సన్నద్ధం కావాలని పార్టీ నాయకులను, నగర పరిధిలోని కమిటీలకు స్పష్టం చేశాను.. నా వద్దకు వచ్చిన కార్యకర్తలు, కమిటీల ప్రతినిధులు ఇప్పటికే పలు దఫాలు సమావేశమై చర్చించుకున్నారు.. జీ.హెచ్.ఎమ్.సీ.లోని పలు డివిజన్లలో ఉన్న జనసేన కమిటీలు క్షేత్ర స్థాయిలో పని చేస్తూ… ఇప్పటికే ప్రజల పక్షాన నిలబడ్డాయి.. తమ కార్యకలాపాలపై సమగ్రంగా సమీక్షించుకుంటున్నాయి.. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని క్షేత్ర స్థాయిలోని కార్యకర్తలు బలంగా కోరుకొంటున్నారు.. వారి అభీష్టానికి అనుగుణంగా జనసేన పార్టీ జీ.హెచ్.ఎమ్.సీ. ఎన్నికల్లో అభ్యర్థులను నిలుపుతుంది.. ’’ అని పవన్ కల్యాణ్ ప్రకటించారు.
అయితే, బీజేపీతో మిత్రపక్షంగా వున్న పవన్ కల్యాణ్ పార్టీ జనసేన గ్రేటర్ ఎన్నికల బరిలోకి దిగితే ఆ పార్టీతో పొత్తు కొనసాగుతుందా ? అన్నదిపుడు ప్రశ్నగా మిగిలింది. రెండు పార్టీలు ఏపీలో కలిసి పని చేస్తున్నా.. తెలంగాణలో ఆ పొత్తు కొనసాగుతుందా ? కొనసాగితే తెలంగాణ బీజేపీకి ఆంధ్ర ముద్ర వేయకుండా గులాబీ పార్టీ వుంటుందా ? అన్నదిపుడు ఆసక్తి రేపుతోంది. అయితే.. ఈ విషయంలో పార్టీ అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటామని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ALSO READ: అళగిరికి బీజేపీ గాలం.. త్వరలో అమిత్షాతో అళగిరి భేటీ!