AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గంధపు చెక్కలను ఎక్కడ నుంచి తెస్తారో తెలుసా? వీడియో

ఆ గంధపు చెక్కలను ఎక్కడ నుంచి తెస్తారో తెలుసా? వీడియో

Samatha J

|

Updated on: Apr 26, 2025 | 2:28 PM

సింహాచలంలో చందనోత్సవానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ప్రధాన గట్టమైన చందనం పూసే కార్యక్రమం కోసం చందనం చెక్కలను ఇప్పటికే సిద్ధం చేశారు ఆలయ అధికారులు. ఈ నెల 24 నుంచి చందనం అరగదీత ప్రారంభిస్తారు. ప్రత్యేక పూజ నిర్వహించి గంధపు చెక్కల నుంచి చందనం తీసే ప్రక్రియను మొదలు పెడతారు. అక్షయ తృతీయ సందర్భంగా నిర్వహించే చందనోత్సవంలో స్వామివారి నిజరూప దర్శనం తర్వాత మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. మూడు మణుగులు అంటే దాదాపు 120 కిలోల చందనం సమర్పణ జరగనుంది. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ రోజు సింహాచలంలో స్వామివారి చందనోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఇందుకోసం నెల రోజుల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభమవుతాయి.

స్వామివారికి చందనపు పూతకు ఉపయోగించే గంధపు చెక్కలను తమిళనాడు నుంచి తెప్పిస్తారు. జాజిపోకల అనే మేలు రకం గంధాన్ని స్వామివారి కోసం వినియోగిస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు ప్రత్యేక పూజలు చేసి గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. సుగంధ ద్రవ్యాలను కలిపి అరగదీసిన చందనాన్ని చందనోత్సవం కోసం సిద్ధం చేస్తారు. అక్షయ తృతీయ ముందు రోజు రాత్రి స్వామివారి పై పూసిన చందనాన్ని తొలగించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత భక్తులకు స్వామివారి నిజరూప దర్శన భాగ్యం కల్పిస్తారు. అక్షయ తృతీయ రాత్రి వరకు భక్తుల దర్శనం కొనసాగుతుంది. ఆ తర్వాత స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. సింహాచలం గంగాధర నుంచి వెయ్యి కలశాలతో నీటిని తీసుకొచ్చి సహస్రఘటాభిషేకం చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి మూడు మణుగుల చందనాన్ని లేపనంగా పోస్తారు. ఆ చందనం పూసిన తర్వాత స్వామివారు మళ్ళీ నిజరూపం నుంచి నిత్యరూపంలోకి మారుతారు. ఈ చందనపు పూత క్రతువు ఏడాదికి నాలుగు సార్లు జరుగుతుంది. అక్షయ తృతీయతో పాటు వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి సమర్పిస్తారు. ఇలా చందనోత్సవాల సందర్భంగా స్వామివారి నుంచి తీసే దాదాపు 500 కిలోల గంధాన్ని అక్షయ తృతీయ రోజున భక్తులకు ప్రసాదంగా అందిస్తారు.